పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే..!
నూతన పీసీసీ కార్యవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
By Medi Samrat
నూతన పీసీసీ కార్యవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త స్థాయి నుంచి అనేకమంది ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, పీసీసీ అధ్యక్షులుగా ఎదిగారు.. పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తే పదవులు వచ్చి తీరుతాయన్నారు. నాకు కాంగ్రెస్ పార్టీ భాద్యతలతోనే ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చామని తెలిపారు.
పార్టీ పదవులు వచ్చాయని పనిచేయక పోతే వారిని పీసీసీ అధ్యక్షుడు పక్కన పెడతారని హెచ్చరించారు. కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి…స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలన్నారు. మళ్లీ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావలసిన బాధ్యత మీదేనన్నారు. పార్టీ నిర్మాణంలో మీరు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
అధికారం వచ్చిన సంవత్సరంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. 18 నెలల్లో రైతుల కోసం లక్షా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాం.. దేశంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇంత ఖర్చు చేయలేదన్నారు. విద్యార్థులకు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు, 40 శాతం డైట్ చార్జీలు పెంచాం.. 100 ఏళ్ల కులగణన కలను నెరవేర్చాం.. కులగణన చేసి మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరాం.. కేంద్రం మెడలు వంచి దేశం లో కులగణన చేపట్టాలని నిర్వహించేలా చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 35 ఏళ్ళ నుంచి పోరాటం చేశారు.. అనేక మంది త్యాగాలు చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యకు పరిష్కారం చూపించాం.. పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను తీసుకొచ్చామన్నారు.
పార్టీ నిర్మాణంలో నాయకులు క్రియాశీలక పాత్ర పోషించాలి.. పార్టీ పదవి అని చిన్న చూపు చూడొద్దు.. రేపు గొప్ప అవకాశాలు ఇచ్చేది పార్టీ పదవులేనన్నారు. 2029లో పార్టీ 2వ సారి అధికారంలోకి వస్తే పదవులన్నీ మీకే వస్తాయన్నారు. పార్టీ నాయకులు ప్రజలకు దగ్గరగా ఉండాలన్నారు. 18 నెలల మన పాలన గోల్డెన్ పీరియడ్.. ప్రజలలోకి తీసుకుపోవాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా నాయకులు ఉండాలన్నారు. 10 ఏళ్ల బీఆర్ ఎస్ పాలనకు, 18 నెలల కాంగ్రెస్ పాలన పైన బహిరంగ చర్చకు సవాల్ చేయాలి.. 18 నెలల్లో మన ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని సూచించారు.