ప్రశ్నించక పోతే తెలంగాణ మూగబోతుంది : కేటీఆర్‌

తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ పిలుపునిస్తే కథానాయకులై కదనరంగంలో కొట్లాడిన విద్యార్థి వీరులకు వినమ్రంగా నమస్కారాలన్నికేటీఆర్ అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  17 Oct 2024 11:08 AM GMT
ప్రశ్నించక పోతే తెలంగాణ మూగబోతుంది : కేటీఆర్‌

తెలంగాణ కోసమే టీఆర్ఎస్ ఆవిర్భవించింది.. కేసీఆర్ పిలుపునిస్తే కథానాయకులై కదనరంగంలో కొట్లాడిన విద్యార్థి వీరులకు వినమ్రంగా నమస్కారాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని కేటీఆర్ ప్రసంగించారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. అంతటి ఉద్ధండుల ముందు ఈ చిట్టి నాయుడు ఎంత.? ఈ చిట్టి నాయుడిని తిట్టాలన్న, ఏదైనా చెప్పాలన్న మనసు రావటం లేదన్నారు. ఎందుకంటే ఆయనకు ఏమీ తెల్వదు. ఏమీ తెల్వదన్న విషయం కూడా ఆయనకు తెల్వదు. మొన్న వికారాబాద్ వెళ్లి హైదరాబాద్ చుట్టు మూడు దిక్కులు సముద్రం ఉందన్నాడు. ఆగస్ట్ 15 రోజు స్పీచ్ లో భాక్రానంగల్ తెలంగాణలో ఉందంటాడు.. రాసిచ్చినది కూడా చూసుకోకుండా చదువుతాడన్నారు. విప్రో సీఈఓ సత్య నాదెళ్ల అంటా.. అలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన ఖర్మ.. గుంపు మేస్త్రీ అంటే ఇళ్లు కట్టేటోళ్లు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇళ్లను కూలగొట్టేటోడన్నారు. పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. రేవంత్ రెడ్డి బాధపెట్టినా సరే ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.

ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావాలని 95 శాతం కొలువులు మన బిడ్డలకే దక్కేట్టు పోరాటం చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు. జిల్లాకు ఓ మెడికల్ కాలేజ్, నర్సింగ్ కళాశాల, గురుకులాలు. ఇవన్నీ మనం సాధించిన విజయాలుగా తెలిపారు. తెలంగాణ మీద ప్రేమ ఉన్న కేసీఆర్, కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయి అన్నారు. తెలంగాణకు ఓ పెట్టుబడి, ఓ అవార్డు వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషపడే వాళ్లం.. మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అంటూ కొంతమంది అడిగేవాళ్లు.. తెలంగాణకు మంచి జరిగితే మాకు మంచి జరిగినట్టే భావిస్తామని సంతోషంతో రొమ్ము విరుచుకొని చెప్పే వాళ్లం అన్నారు. శ్రీకాంత్ చారి, యాదిరెడ్డి, ఇషాంత్ రెడ్డి లాంటి వందల మంది విద్యార్థుల త్యాగాలతో పునీతమైన నేల తెలంగాణ అన్నారు.

నీళ్లు, నియామాకాలు, నిధులు అనే నినాదాన్ని ప్రామాణికంగా పనిచేశాం అన్నారు. నీళ్ల రంగంలో సంపూర్ణ విజయం సాధించాం. కాళేశ్వరం పూర్తి చేశాం. పాలమూరు-రంగారెడ్డి పనులు 90 శాతం పూర్తి చేశాం అన్నారు. నల్గొండలో ఫ్లోరోసిస్ ను పూర్తిగా తుడిచి వేసిన ఘనత కేసీఆర్ కే దకుతుంధన్నారు .నీళ్లు, రైతుబంధు సహా భూముల విలువ పెంచి…కేసీఆర్ రైతుల్లో ధీమా నింపారన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలకు కష్టం వచ్చిన సరే ప్రజలు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ఆశ ఆడ బిడ్డలు వచ్చి కేసీఆర్ మేము అడగకుండానే 9,900 ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మాకు 18 వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబితే మోసం పోయామని చెబుతున్నారన్నారు. చిట్టినాయుడిని కదిలించాలంటే మీరు వేలాది గా తరలి రావాల్సిన అవసరముందన్నారు. గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయాలని అశోక్ నగర్ లో పోరాటం చేసిన విద్యార్థులు తెలంగాణ భవన్ కు వచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను అవమానించేలా రిజర్వేషన్లలో మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో విద్యార్థులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం లోపభూయిష్ట విధానాలతో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రద్దయ్యే పరిస్థితి ఉందన్నారు. అశోక్ నగర్ కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ అక్కడ పోలీసులను పెట్టటంతో విద్యార్థులే తెలంగాణ భవన్ కు వచ్చారు. ప్రజలకు కష్టమొస్తే గాంధీ భవన్, బీజేపీ ఆఫీస్ కు కాదు.. తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారన్నారు. ప్రజల గూడు కూలగొడుతుంటే కేసీఆర్ కు చెప్పుకుంటే సమస్య తీరుతదని ప్రజలు భావిస్తున్నారు. నేను బయలుదేరే ముందు ఇంటి వద్దకు ఆటో యూనియన్ వాళ్లు కూడా వచ్చి వాళ్ల ధర్నాకు రావాలని కోరారు. చిట్టి నాయుడు పాలనలో బాధ పడని వాళ్లు లేరన్నారు. ఊళ్లలో రైతులు పొట్టు పొట్టు తిడుతున్నారు. తులం బంగారం, బతుకమ్మ చీరలు ఏదీ దిక్కులేని పరిస్థితి తెచ్చారన్నారని మండిపడుతున్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడు ఆడ బిడ్డలను ఇంటి ఆడపడుచును చూసుకున్నట్టు చూసుకున్నాడని గుర్తు చేశారు. టెన్త్ పాసైతే చాలు పది వేలు, ఇంటర్ పాసైతే 15 వేలు, డిగ్రీ పాసైతే 25 వేలు, పీజీ పాసైతే లక్షా, పీహెచ్ డీ చేస్తే లక్షా అన్నాడు. ఎవరికైనా వచ్చాయా? ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు.. తెలంగాణకు అతి ప్రమాదకరమైన పార్టీ బీజేపీ. మతాన్నిఅడ్డంపెట్టుకొని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ అన్నారు. పేద ప్రజల ఇళ్లు కూలగొడుతుంటే, కేసులు పెడుతుంటే బీజేపోళ్లు మాట్లాడుతున్నారా? చిట్టి నాయుడు 60 వేల ఉద్యోగాలు ఇచ్చినా అని అంటుంటే మాత్రం చిత్రంగా అనిపిస్తోందన్నారు. ఉద్యోగం ఇవ్వాలంటే నోటిఫికేషన్, పరీక్షలు పెట్టాలె. మరి చిట్టి నాయుడు వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చాయి అన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలకు మాత్రం 2 ఉద్యోగాలు వచ్చాయి.

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. ప్రజలు మనకు రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. వాళ్లను అనటానికి ఏమీ లేదు.. మనమే పొరపాట్లు చేశాం.. మళ్లీ ప్రజలు మెచ్చే విధంగా వాళ్లకు దగ్గరవుదాం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలది. డీఎంకే మాదిరిగా మరో 70 ఏళ్ల పాటు బలంగా ఉండేలా తీర్చిదిద్దుకుందాం అన్నారు. విద్యార్థి నాయకులంతా కూడా ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, నాయకులు కావాలన్నారు.

Next Story