సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని.. బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని.. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉందని.. కానీ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేందుకు మంత్రులంతా ఢిల్లీకి వెళ్లారని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఢిల్లీలో పెద్ద పంచాయతీ అవుతుందని.. అందుకే కేబినెట్ సమావేశం రద్దు అయ్యిందని.. ఈ విషయమై ఢిల్లీలో పంచాయతీ నడుస్తుందని ఆరోపించారు.
ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లను రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారని ఆరోపించారు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని కోరారు. తన ఫోన్ హ్యాక్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని తెలిపారు. తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పాడని అన్నారు.