రాజా సింగ్ రాజీనామాపై ఘాటుగా స్పందించిన బీజేపీ అధిష్టానం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ కీలక ప్రకటన చేసింది
By Medi Samrat
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం పరాకాష్ఠకు చేరిందని.. రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నికలలో ఆయన కూడా నామినేషన్ వేస్తానని పార్టీ కార్యాలయానికి వచ్చారని. జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అభయ్ పాటిల్ ఆయన కోరిక మేరకు నామినేషన్ పత్రాలు ఇచ్చి నామినేషన్ వేసుకునే అవకాశం ఇచ్చారని పేర్కొంది. అయితే.. శోభా కరండ్లాజేకి 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతో నామినేషన్ ఫామ్ సమర్పించవలిసి ఉండగా, రాజా సింగ్ కేవలం ముగ్గురు సభ్యుల సంతకాలతో ఉన్న ఫామ్ మాత్రమే సమర్పించారని వెల్లడించింది.
ఎన్నికల నిబంధన ప్రకారం.. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలలో పోటీ చేయడానికి 10 మంది స్టేట్ కౌన్సిల్ సభ్యుల సంతకాలతో మరో ఫామ్ సమర్పించవలసిందిగా శోభా కరండ్లాజే రాజాసింగ్ను కోరారు.. రాజాసింగ్ నామినేషన్ కి మద్దతిచ్చే స్టేట్ కౌన్సిల్ సభ్యులు లేక పార్టీ పోటీ చేయనివ్వట్లేదని అబద్ధాలతో పార్టీపై అభాండాలు వేస్తున్నారని బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. రాజా సింగ్ సమర్పించిన రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడికి పంపించడం జరుగుతుంది. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు రాజీనామా లేఖ సమర్పించాలని, పార్టీకంటే ఎక్కువ ఎవరూ కాదని బీజేపీ ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షులు వారి నియోజకవర్గానికి వచ్చినా సరే వారి కార్యక్రమాలకు హాజరుకాకుండా పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా రాజాసింగ్ వ్యవహారం ఉందని విమర్శించింది.