సీఎం ఎందుకు సిట్ విచారణకు హాజరుకావడం లేదు? స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?
సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయ్యానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
By Medi Samrat
సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయ్యానని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ దిల్ కుశ్ గెస్ట్ వద్ద సిట్ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 వేల 500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించారు. నాతోపాటు రేవంత్ రెడ్డి, హరీష్ రావుసహా ఆనాటి మంత్రుల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పోన్లను కూడా ట్యాప్ చేశారు.. నా ఫోన్ ను ప్రతి క్షణం ట్యాప్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రూప్ 1 పేపర్ ను లీక్ అయిన విషయం తెలిసిందే కదా.? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును విచారించిన జడ్జీ ఫోన్లను కూడా ట్యాప్ చేసిన దుర్మార్గులు కేసీఆర్.. ఆఖరకు సొంత బిడ్డ కవిత ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు.. దేశవ్యాప్తంగా మంచి పేరున్న SIB వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లను, లీడర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నీచులు.. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు లాంటి లుచ్చాగాళ్లను ఏం చేసినా తప్పులేదు అన్నారు.
మావోయిస్టుల పేర్లు చెప్పి నాతోపాటు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఫోన్లను ట్యాప్ చేశారు.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నరు.. కాంగ్రెసోళ్ల దగ్గర ఎస్ఐబీని అడ్డాగా చేసుకుని కోట్ల రూపాయలు పట్టుకున్నరు.. ఆ పైసలన్నీ ఎటుపోయినయ్... ట్యాపింగ్ గ్యాంగ్ తిన్నదా? ట్విట్టర్ టిల్లు తిన్నడా? తేల్చాలి.. దీనిపై ఈడీకి ఎందుకు లేఖ రాయడం లేదు.? అని ప్రశ్నించారు. తక్షణమే ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని కేసీఆర్, ప్రభాకర్ రావు చేసిన వసూళ్ల పర్వంపై విచారణ జరపాలన్నారు. ఈడీకి లేఖ రాస్తే తక్షణమే ఈడీ విచారణ చేయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
కేసీఆర్, కేటీఆర్, సంతోష్ మినహా బీఆర్ఎస్ నేతల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయన్నారు. సొంత కూతురు ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచులు కేసీఆర్.. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడే కదా.. రేవంత్ రెడ్డి ఎందుకు సిట్ విచారణకు హాజరు కావడం లేదు.? ఎందుకు స్టేట్ మెంట్ ఇవ్వడం లేదు? కేసీఆర్ తానా అంటే రేవంత్ తందానా అంటున్నారు.. అందుకే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను అరెస్ట్ చేయడం లేదన్నారు. ప్రశ్నిస్తున్న బీజేపీపై ఎదురు దాడి చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నరు.. సీఎం కూడా వెంటనే సిట్ విచారణకు హాజరై స్టేట్ మెంట్ ఇవ్వాలన్నారు.
జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఆధారాలతోసహా ఉన్నాయి కదా.. జడ్జీలను పిలిచి వాళ్ల స్టేట్ మెంట్ రికార్డు చేసే అధికారం సిట్ పోలీసులకు ఉన్నదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్ మెంట్ అడిగే అధికారం ఈ సిట్ కు ఉందా? ఆనాటి సీఎం కేసీఆర్, ఆయన కొడుకు ట్విట్టర్ టిల్లును పిలిచి విచారించే దమ్ము సిట్ కు ఉందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును మంట కలిపిన వ్యవహారమిది.. అధికారం కోసం తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకున్నరు.. గద్దెనెక్కినంక ఫోన్లను ట్యాప్ చేస్తూ తెలంగాణ ప్రజల ఎమోషన్ ను వాడుకున్నరు.. సాక్షాత్తు నాటి రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాచేలా నీచానికి పాల్పడింది.. సిట్ విచారణ పేరుతో ఇక డ్రామాలు ఆపండి.. సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయండి.. మీరు లేఖ రాస్తే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధం అన్నారు. సీబీఐ నేరుగా విచారణ చేసే అవకాశముంటే కేసీఆర్, ఆయన కొడుకును ఎప్పుడో బొక్కలో వేసేవాళ్లం అన్నారు.