కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ ఆధారంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపారు. కాగా వివర ఇచ్చేందుకు తమకు సమయం కావాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కోరారు.
కాగా ఏడుగురు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు అనర్హత పిటిషన్లతో పాటు కలిపి విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.
కాగా, ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపింది. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలంటూ తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సెక్రటరీ ప్రస్తుతం తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. వారు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఉత్కంఠగా మారింది.