ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ను అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, శ్రీధర్ ఆస్తులపై ఏసీబీ ప్రకటన విడుదల చేశారు. నూనె శ్రీధర్కు రూ.200 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీధర్ ఇంట్లో భారీగా బంగారం, నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి కాళేశ్వరం ఇరిగేషన్ ఈఈగా పనిచేసిన శ్రీధర్ ఇల్లు, కార్యాలయంతో పాటు అతని కుమారుడు, బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు హైదరాబాద్, కరీంనగర్, బెంగళూరులలో మొత్తం 20 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడపెట్టినట్లుగా అధికారులు గుర్తించారు.
శ్రీధర్కు తెల్లాపూర్లో విల్లా, అమీర్పేట్లో కమర్షియల్ కాంప్లెక్స్ అలాగే హైదరాబాద్లో ఇండిపెండెంట్ ఇల్లు, మలక్పేట్లో మల్లీస్టోరేడ్ బిల్డింగ్, కరీంనగర్లో 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో 19 ప్లాట్లతో పాటు పలు హోటల్స్లో బినామీల పేరిట పెట్టుబడులు కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. శ్రీధర్ థాయ్లాండ్లో తన కొడుకుకు డెస్టినేషన్ మ్యారేజ్ చేశాడు. సోదాలలో మొత్తం 200 కోట్లు రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. శ్రీధర్ను అరెస్ట్ చేసిన అధికారులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచి జ్యూడిషయల్ రిమాండ్ కి తరలించారు.