పూణెలో మహబూబ్‌నగర్ బాలుడిపై లైంగిక దాడి.. ఆపై దారుణ హ‌త్య‌..

13-year-old boy from Mahbubnagar sexually assaulted and murdered in Pune. పుణెలో మహబూబ్‌నగర్ జిల్లా గున్నెడ మండలానికి చెందిన ఓ బాలుడు మృతి చెందాడు.

By Medi Samrat  Published on  27 March 2022 8:27 AM GMT
పూణెలో మహబూబ్‌నగర్ బాలుడిపై లైంగిక దాడి.. ఆపై దారుణ హ‌త్య‌..

పుణెలో మహబూబ్‌నగర్ జిల్లా గున్నెడ మండలానికి చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. 13 ఏళ్ల దివ్యాంగుడైన బాలుడిపై దారుణంగా లైంగిక దాడి చేసి ఆపై హత్య చేశారు. మృతదేహాన్ని చెత్తకుండీలో పడేసిన దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బాలుడి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో పూర్తయ్యాయి. వివరాల్లోకి వెళితే గున్నేడ మండలం పీర్లబండ తండాకు చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు. రెండో బాలుడు కరణ్ (13) శారీరక వికలాంగుడు (మూగ) తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. దంపతులు 15 ఏళ్లుగా పూణెకు వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ.. రెండేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి.. రెండు నెలల క్రితం బాలుడిని త‌మ వెంట‌ పూణెకు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడంతో.. బాలుడు ఇంట్లోనే ఉంటున్నాడు. గురువారం కూడా తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లగా బాలుడు ఇంట్లోనే ఉన్నాడు.

సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న యూపీకి చెందిన పుంటి అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి బాలుడిని బైక్‌పై ఓ ప్రాంతానికి తీసుకెళ్లి.. మరో ఇద్దరితో కలిసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలుడి చేయి విరగడంతో పాటు ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. శృంగార కోరిక తీర్చేందుకే అతడిని హత్య చేశారని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. దుండగులు బాలుడి మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకెళ్ళి డబ్బాలో పడవేయడాన్ని సెక్యూరిటీ గార్డు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తప్పిపోయిన కుమారుడి కోసం వెతకడం ప్రారంబించారు. పోలీసులతో పాటు వెళ్లి చూడగా కుమారుడిని గుర్తించి బోరున విలపించారు త‌ల్లిదండ్రులు. శుక్రవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. బాలుడి మృతదేహాన్ని శనివారం ఉదయం పూణె నుంచి అతని తల్లిదండ్రుల స్వగ్రామం పీర్లబండతండాకు తీసుకొచ్చారు. బాలుడి అంత్యక్రియలకు హాజ‌రైన‌ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేసి అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి.. మహారాష్ట్ర డీజీపీతో ఫోన్ లో మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Next Story