తహసీల్దార్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 24 July 2020 8:20 PM ISTఅవినీతి కేసులో ఏసీబీ అధికారులు.. గూడూరు తహసీల్దార్ షేక్ హసీనాబీని అరెస్ట్ చేశారు. గత సంవత్సరం నవంబర్ 7వ తేదీన ఏసీబీ అధికారులు హసీనాపై నిఘా పెట్టగా.. రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ తహసీల్దార్ హసీనబీ పరిచయస్థుడు మహబూబ్ ఆలీ ఏసీబీకి పట్టుబడ్డాడు. తొమ్మిది నెలలుగా హసీనాబీ పరారీలో ఉండగా.. నేడు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
వివరాళ్లోకెళితే.. ఆన్లైన్లో భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్లియర్ చేసేందుకు సురేష్ అనే వ్యక్తిని ఆమె రూ. 8 లక్షలు డిమాండ్ చేసింది. అయితే తొలుత రూ. 4 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఆ రూ.4 లక్షలను పాణ్యం బస్స్టాండ్లో మహబూబ్ అనే వ్యక్తికి ఇవ్వాలని తహసీల్దార్ చెప్పింది.
ప్లాన్ ప్రకారం.. సురేష్తో లంచం డబ్బులను మహబూబ్ వద్దకు పంపించింది హసీనాబీ. ముందే నిఘాపెట్టిన ఏసీబీ అధికారులు మహబూబ్ ఆలీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మహబూబ్ ఆలీ దొరికి పోవడంతో అప్పటి నుండి హసీనాబీ పరారీలో ఉంది. అప్పటి నుండి ఏసీబీ అధికారులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్న హసీనీబీని.. ఈరోజు ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.