సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
By సుభాష్ Published on 26 Jun 2020 10:39 AM IST
తెలంగాణలోని సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చివ్వేంల మండలం కాసింపేట రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ను కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఇలా రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా .. జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి నడపడం, అతివేగం తదితర కారణాల వల్ల ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల లాక్డౌన్ కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయినా.. మళ్లీ లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో ప్రమాదాలు మొదలయ్యాయి. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన మొదట్లో భారీగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో అధిక శాతం మంది వలస కూలీలు మృతి చెందడం బాధాకరం.