అక్కడంతా అగ్రవర్ణాలదే..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 12 Aug 2020 7:01 AM GMTవర్ణ వివక్షపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇకపై వర్ణ వివక్ష ఉండకూడదని.. అందరూ సమానమే అంటూ చెబుతూ పలు చోట్ల ఉద్యమాలు కూడా జరిగాయి. యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రాంతాల్లో మీడియా సంస్థల్లో ఎక్కువగా తెల్లజాతీయులే ఉన్నారట.. ఇక భారత మీడియాలో అగ్రవర్ణాలదే ఆధిపత్యం అంటూ రాయిటర్స్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా బ్రాహ్మణులు భారత న్యూస్ రూమ్స్ లో ఎక్కువగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు.
భారతదేశంలో బ్రాహ్మణుల జనాభా 4 శాతం కాగా.. ఇంగ్లీష్, హిందీ భాషలకు సంబంధించిన మీడియా సంస్థల్లోని అగ్రవర్ణాలలో 88 శాతం జర్నలిస్టులు, ఎడిటర్లు బ్రాహ్మణులేనని తాజా సర్వేలో చెబుతోంది.
భారత్ కు చెందిన న్యూస్ రూమ్స్ లో బ్రాహ్మణుల ఆధిపత్యం, ఇతర అగ్రవర్ణాల వారి ఆధిపత్యంపై ఆక్స్ఫామ్ ఇండియా న్యూస్ లాండ్రీ మీడియా సంస్థతో కలిసి ఓ రిపోర్టును తయారుచేసింది. ‘Who Tells Our Stories Matters: Representation of Marginalised Caste Groups in Indian Newsrooms’ అన్న టైటిల్ తో ఇంగ్లీష్, హిందీ న్యూస్ ఇండస్ట్రీలలో శాంపుల్ సర్వేను నిర్వహించింది.
మొత్తం 121 న్యూస్ రూమ్ లీడర్ షిప్ పొజిషన్లలో ఎడిటర్-ఇన్-ఛీఫ్, మేనేజింగ్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, బ్యూరో ఛీఫ్, ఇన్పుట్/అవుట్ పుట్ ఎడిటర్- న్యూస్ పేపర్స్ లో, టీవీ ఛానల్స్, న్యూస్ వెబ్సైట్స్, మేగజైన్ లలో 106 మంది అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు.
నలుగురు టీవీ డిబేట్ యాంకర్లలో ముగ్గురు యాంకర్లు అగ్రవర్ణాలకు చెందిన వారే..! హిందీ ఛానల్స్ లోని 40 యాంకర్లు, ఇంగ్లీష్ ఛానల్స్ లోని 47 మంది యాంకర్లు అగ్రవర్ణాలకు చెందిన వారు. ఒక్కరు కూడా దళితులు, ఆదివాసీలు, వెనుకబడ్డ కులాలకు చెందిన వారు లేరు.
ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల లో 5 శాతం ఆర్టికల్స్ మాత్రమే దళితులు, ఆదివాసీలు రాస్తున్నారు. హిందీ న్యూస్ పేపర్లలో 10 శాతం రాస్తున్నారు.
బైలైన్డ్ ఆర్టికల్స్ 72 శాతం అగ్రవర్ణాల వారే రాస్తున్నారని తాజా సర్వే ద్వారా తెలుస్తోంది.
ఉద్యోగం చేస్తున్న సమయంలో కుల వివక్షలు కూడా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అగ్రకులాలకు చెందిన వారు కుల వివక్ష చూపిస్తూ కొందరికి న్యూస్ రూమ్స్ లో అందాల్సిన స్థానం దక్కకుండా చేశారని కూడా వెల్లడించారు.