ఆసీస్ బ‌య‌లుదేరిన భార‌త జ‌ట్టు.. టీమ్ వెంట వెళ్ల‌ని రోహిత్ శర్మ

Team India Depart For Aussies Tour. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020సీజ‌న్ ముగిసింది. ఇన్నాళ్లు ప్ర‌త్య‌ర్థులుగా

By Medi Samrat  Published on  12 Nov 2020 7:39 AM GMT
ఆసీస్ బ‌య‌లుదేరిన భార‌త జ‌ట్టు.. టీమ్ వెంట వెళ్ల‌ని రోహిత్ శర్మ

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2020సీజ‌న్ ముగిసింది. ఇన్నాళ్లు ప్ర‌త్య‌ర్థులుగా త‌ల‌ప‌డిన ఆట‌గాళ్లు తిరిగి ఒక్క‌టిగా క‌లిసి ఆడాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ప్ర‌తిష్టాత్మ‌క ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న కోసం కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా గురువారం యూఏఈ నుంచి బ‌య‌లుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు అందరూ కొత్త రకం పిపిఈ కిట్లను ధరించి ఉన్నారు. నేరుగా సిడ్ని చేరుకోనున్న భార‌త ఆట‌గాళ్లు అక్క‌డే క్వారంటైన్‌లో 14 రోజులు ఉండి ప్రాక్టీస్ చేయ‌నున్నారు.

ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత జట్టు మొత్తం మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో డిసెంబర్ 17-21 వరకు జరిగే మొదటి టెస్టులో మాత్రమే భారత కెప్టెన్ విరాట్ ఆడనున్నాడు. ఎందుకంటే... ప్రస్తుతం కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్. వారు జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో కోహ్లీ తిరిగి భారత్ కు వచ్చేస్తాడు.

జ‌ట్టు వెంట వెళ్ల‌ని రోహిత్‌..

ఇదిలా ఉంటే.. భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. ముంబై జట్టుతోనే యూఏఈ నుంచి నేరుగా భారత్‌కు రానున్నాడు. రోహిత్ భారత జట్టుతో కలిసి ఆసీస్ వెళ్లడం లేదని, ప్రత్యేకంగా వెళ్లనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రోహిత్ భారత్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకోనున్నాడు.

ఈ పర్యటనలో టెస్ట్ టీమ్‌లో అవకాశం అందుకున్న రోహిత్‌.. కోహ్లీ గైర్హాజరీలో కీలకం కానున్నాడు. రోహిత్ శర్మ గాయపడటంతో తొలుత ఆసీస్‌ టూర్‌కు ఎంపిక చేయని టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ.. ఆ తర్వాత టెస్ట్ జట్టులోకి ఎంపిక చేసింది.. విరాట్ చివరి మూడు టెస్ట్‌లకు దూరం అవుతున్న నేపథ్యంలో రోహిత్ కు అవకాశం కల్పించింది.


Next Story