అకస్మాత్తుగా శస్త్రచికిత్స.. సూర్యకుమార్ యాదవ్కు ఏమైంది.?
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు.
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. జూన్ 25 రాత్రి సూర్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆసుపత్రిలో ఉన్న తన ఫోటోను షేర్ చేస్తూ అందరికీ సమాచారమిచ్చాడు. ఈ పోస్ట్లో తను కోలుకుంటున్నానని.. త్వరలో మైదానంలోకి రీఎంట్రీ ఇస్తానని రాశాడు.
34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ టీ20 పగ్గాలు అప్పగించింది. ప్రస్తుతం సూర్య విరామంలో ఉన్నాడు. ఈ నేథ్యంలోనే అతడు జర్మనీలో స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సమాచారాన్ని అతడు స్వయంగా పోస్ట్ ద్వారా తెలియజేశాడు.
పొత్తికడుపులో కుడివైపు కింది భాగంలో స్పోర్ట్స్ హెర్నియా కోసం శస్త్రచికిత్స జరిగింది. విజయవంతమైన శస్త్రచికిత్స తర్వాత నేను కోలుకోవడం సంతోషంగా ఉంది. క్రికెట్ మైదానంలోకి తిరిగి రావాలని ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.
సూర్యకుమార్ యాదవ్ సర్జరీ చేయించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు 2024, 2023లలో అతడు చీలమండ శస్త్రచికిత్సతో పాటు మరో సర్జరీ చేయించుకున్నాడు.
ఇదిలావుంటే.. భారత జట్టు ఆగస్టు నెలలో బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉంది, అక్కడ వారు T20I సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ ఆగస్టు 26 నుండి ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ ఆగస్టు 31 న జరుగుతుంది. ఈ సిరీస్కి ఇంకా 2 నెలల సమయం ఉంది. కాబట్టి సూర్య పూర్తిగా ఫిట్గా లేకుంటే అతడు సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది. అతడు గైర్హాజరీలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు.