భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా చికిత్సకై నిపుణుల సలహా కోసం ఇంగ్లాండ్ బయలుదేరాడు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా చేయించుకోవచ్చని చెబుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ IPL 2025లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ముంబై ఇండియన్స్ తరపున 700 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత ముంబై ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నీలోనూ పాల్గొన్నాడు.
అయితే.. ముంబై టీ20 లీగ్లో పాల్గొన్న సూర్యకుమార్ నొప్పితో బాధపడుతున్నాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. 'సూర్యకుమార్ తన పొత్తికడుపు కుడివైపున స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. దీంతో అతడు వైద్యం నిమిత్తం సంప్రదింపుల కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు. అవసరమైతే అక్కడ అతడు శస్త్రచికిత్స చేయించుకుంటాడు. బాధతోనే మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్.. ఐపీఎల్, ముంబై టీ20 లీగ్ల కమిట్మెంట్లను నెరవేర్చాలనుకున్నట్లు కూడా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మూలం ప్రకారం.. ఆగస్టు-సెప్టెంబర్కు ముందు T20 మ్యాచ్లు లేవు.. కాబట్టి సూర్యకుమార్ తన గాయానికి చికిత్స చేయించుకోవడానికి తగిన సమయం ఇదేనని.. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో గాయం నుండి కోలుకోవడానికి తగినంత సమయం కూడా ఉంటుందని సూర్యకుమార్ భావించినట్లు తెలుస్తుంది.