రీఎంట్రీ ఇచ్చేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్న యువ క్రికెట‌ర్‌..!

గతేడాది ఆగస్టు నుంచి పృథ్వీ షా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. టీమ్ ఇండియాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో

By Medi Samrat  Published on  13 Jan 2024 11:00 AM GMT
రీఎంట్రీ ఇచ్చేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్న యువ క్రికెట‌ర్‌..!

గతేడాది ఆగస్టు నుంచి పృథ్వీ షా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. టీమ్ ఇండియాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో పృథ్వీ ఇంగ్లాండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్ షైర్ తరపున ఆడాడు. అప్పుడే షా గాయపడ్డాడు. పృథ్వీ షా తాజాగా గాయం నుంచి కోలుకుని ఇటీవల నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఇందుకు సంబంధించి షా ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షా గాయపడక ముందు నార్తాంప్టన్‌షైర్ తరఫున నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 429 పరుగులు చేశాడు.

షా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో త‌న‌ పునరావాసాన్ని పూర్తి చేస్తున్నాడు. రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో పృథ్వీ ముంబై తరఫున ఆడలేకపోయాడు. షా త్వరలోనే రంజీల్లో పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షా తన బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో తన స్టోరీలో పంచుకున్నాడు.

షా తిరిగి రావడంపై అభిమానులు సానుకూల వ్యాఖ్యలు చేశారు. వీడియోలో షా కొన్ని ఫాస్ట్ బంతులను ఎదుర్కోవ‌డం చూడ‌వ‌చ్చు. అంటే త్వరలోనే షా మళ్లీ మైదానంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. ఇది కాకుండా డిసెంబరు 19న దుబాయ్‌లో జరిగిన IPL వేలంలో షాను వ‌దిలేయ‌కుండా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ త‌మ‌తోనే ఉంచుకుంది. అయితే ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి షా గత సీజన్‌లో రాణించ‌లేక‌పోయాడు. ఆ కారణంగా అతను చాలా మ్యాచ్‌లలో కుర్చీకే ప‌రిమిత‌మ‌య్యాడు. మరి షా ఈ సీజ‌న్‌లో తన ఆటతీరుతో మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానుల మనసు గెలుచుకుంటాడా లేదా అన్నది చూడాలి.

Next Story