టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఓ పాక్ క్రికెటర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. సూపర్-8 దశలో శ్రీలంకతో మ్యాచ్కు ముందు ఈ ఘటన జరిగింది. పాక్ జట్టు ఫిబ్రవరి 28న పల్లెకెలెలో శ్రీలంకతో తమ చివరి సూపర్-8 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్కు ముందు, కాండీ లోని గోల్డెన్ క్రౌన్ హోటల్లో ఓ పాక్ ఆటగాడు మహిళా హౌస్కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు మహిళ సాయం కోసం కేకలు వేయగా, ఇతర హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలుస్తుంది. ఈ విషయం పాక్ మేనేజర్ నవీద్ చీమాకు తెలియజేయగా ఆయన హోటల్ మేనేజ్మెంట్కు క్షమాపణ చెప్పి సమస్యను అంతర్గతంగా పరిష్కరించాడని కథనాలు వచ్చాయి.
ఇప్పటికే 2026 టీ20 ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన కారణంగా ప్రతి ఆటగాడికి 50 లక్షల రూపాయల (పాకిస్థానీ రూపాయిలు) జరిమానా విధించినట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు ఆ ఆటగాడి పేరును అధికారికంగా బయటపెట్టలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.