సూర్య.. ముంబై ఇండియన్స్ జట్టులో చేరే డేట్ వచ్చేసింది
సూర్యకుమార్ యాదవ్ IPL 2024లో ముంబై ఇండియన్స్ తరపున ఆడబోతున్నాడు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 4 April 2024 4:00 PM IST
సూర్య.. ముంబై ఇండియన్స్ జట్టులో చేరే డేట్ వచ్చేసింది
సూర్యకుమార్ యాదవ్ IPL 2024లో ముంబై ఇండియన్స్ తరపున ఆడబోతున్నాడు. అతడికి నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ సర్టిఫికెట్ లభించడంతో ఏప్రిల్ 4 నుండి ముంబై జట్టుతో చేరుతాడనే ప్రచారం జరిగింది. అయితే ఒకరోజు ఆలస్యంగా సూర్య ముంబై జట్టులో జాయిన్ అవ్వనున్నాడు. ఏప్రిల్ 5న సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టులో చేరబోతున్నాడు. నం.1 T20I బ్యాటర్ చివరిగా పోటీ క్రికెట్ను డిసెంబర్ 2023లో ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడవ T20Iలో సెంచరీ చేశాడు. ఆ సిరీస్లో అతను చీలమండ గాయంతో బాధపడడంతో అతనికి శస్త్రచికిత్స అవసరమైంది. అతను బెంగళూరులోని NCA ఫెసిలిటీలో తన పునరావాసాన్ని కొనసాగించడంతో క్రికెట్ లోకి తిరిగి రావడానికి కాస్త ఆలస్యం అయింది.
ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకూ సూర్య లేకపోవడంతో ముంబైపై ప్రభావం పడింది. మొదటి మూడు మ్యాచ్ లలో సూర్య కుమార్ యాదవ్ ఉండి ఉంటే ఫలితం వేరేగా ఉండేదని అభిమానులు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య కుమార్ యాదవ్ ఆదివారం నాడు మ్యాచ్ కు అందుబాటులో ఉండడం అభిమానులకు ఊరటనిస్తూ ఉంది. వరుస మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ గెలవాలని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.