తొలి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం

India dominate to win by an innings and 222 runs.మొహాలీ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా 222

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2022 11:22 AM GMT
తొలి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం

మొహాలీ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 574/8 వ‌ద్ద డిక్లేర్ చేయ‌గా.. అనంత‌రం శ్రీలంక మొద‌టి ఇన్నింగ్స్‌లో174 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్ ఆడిన లంక జ‌ట్టు.. భార‌త స్పిన్న‌ర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో కూడా 178 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కేవ‌లం మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. పూర్తిస్థాయిలో తొలిసారి టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కు, అలాగే వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న‌ విరాట్‌కు ఈ విజ‌యం ఓ మ‌ధుర జ్ఞాప‌కంగా మిగిలిపోనుంది. ఇక రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్ఇండియా 1-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు బెంగళూరు వేదికగా మార్చి 12 నుంచి 18 వరకు జరగనుంది.

400 ప‌రుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన లంక‌ను భార‌త బౌల‌ర్లు ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా స్పిన్న‌ర్లు జ‌డేజా, అశ్విన్‌లు చెల‌రేగారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో లంక 178 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. లంక బ్యాట్స్‌మెన్ల‌లో డిక్వెల్లా(51 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మిగ‌తా బ్యాట‌ర్ల‌లో ధ‌నంజ‌య డిసిల్వా 30, మాథ్యూస్ 28, క‌రుణ ర‌త్నె 27 ప‌రుగులు చేశారు. ఓ వైపు వికెట్లు ప‌డుతున్నా డిక్వెల్లా మాత్రం త‌న‌దైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఈ క్ర‌మంలో అర్థ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్‌, జ‌డేజా చెరో నాలుగు, ష‌మీ 2 వికెట్లు ప‌డ‌గొట్టారు.

Next Story