ఇంగ్లండ్ ముందు 368 పరుగుల లక్ష్యం..!
England need 291 runs. నాలుగో టెస్టులో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లండ్ ముందు
By - Medi Samrat |
నాలుగో టెస్టులో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 466 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లండ్ ముందు 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజు ఆటలో శార్దూల్ ఠాకూర్ (60), రిషబ్ పంత్ (50)ల రాణించడంతో భారత్ భారీ స్కోరును సాధించగలిగింది. ఆఖర్లో ఉమేశ్ యాదవ్ (25), జస్ర్పీత్ బుమ్రా (24) కూడా రాణించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, రాబిన్సన్ 2, మొయిన్ అలీ 2, ఆండర్సన్ 1, రూట్ 1 వికెట్ తీశారు. లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన 263 పరుగులు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలవడం కష్టమని అంటున్నా.. పిచ్ మాత్రం బ్యాటింగ్ కు ఇంకా అనుకూలిస్తూనే ఉంది.
ఆటకు రేపు చివరి రోజు కాగా, టీమిండియా పేసర్ల దూకుడును తట్టుకుని ఇంగ్లండ్ ఏంచేస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఓపెనర్లు మాత్రం ధీటుగా ఆడుతున్నారు. వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది ఇంగ్లండ్. హమీద్ 43 పరుగులు, బర్న్స్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే ఆఖరి రోజు 291 పరుగులు కావాలి.. భారత్ కు 10 వికెట్లు కావాలి. మ్యాచ్ లో ఎలాంటి ఫలితం అయినా రావొచ్చు. ఈ టెస్టులో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 191 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 290 పరుగులు చేసి కీలకమైన 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ అద్భుతంగా రాణించింది.