రోహిత్‌కు జ‌ట్టులో స్థాన‌మే కష్టం.. ఇంకా కెప్టెన్సీ కూడానా..?

Brad Hogg Picks Ajinkya Rahane To Lead The Indian Team. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ముగిస‌న వెంట‌నే టీమ్ఇండియా ఆట‌గాళ్లు

By Medi Samrat  Published on  17 Nov 2020 5:55 AM GMT
రోహిత్‌కు జ‌ట్టులో స్థాన‌మే కష్టం.. ఇంకా కెప్టెన్సీ కూడానా..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ముగిస‌న వెంట‌నే టీమ్ఇండియా ఆట‌గాళ్లు గ‌త‌వారం ఆసీస్ ప‌ర్య‌ట‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. క‌రోనా త‌రువాత టీమ్ఇండియా ఆడుతున్న తొలి సిరీస్ కావ‌డంతో అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఈ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. గ‌త ప‌ర్య‌ట‌లో టెస్టు సిరీస్ గెలిచిన టీమ్ఇండియా.. మ‌రోసారి అలాంటి ప్ర‌ద‌ర్శ‌నే పున‌రావృతం చేయాల‌ని బావిస్తోంది. అయితే.. తొలి టెస్టు అనంత‌రం కెప్టెన్ విరాట్ కోహ్లీ భార‌త్‌కు వ‌చ్చేస్తుండ‌డం భార‌త్ ఎదురుదెబ్బ అని చెప్ప‌వ‌చ్చు.

ఇక ప‌రుగుల యంత్రం కోహ్లీ లేకుంటే.. మిగ‌తా మూడు టెస్టుల్లో భార‌త కెప్టెన్‌గా ఎవ‌రు ఉంటారు అనే ప్ర‌శ్న ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో చోటు ద‌క్కని హిట్‌మ్యాన్‌కు టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. విరాట్ లేక‌పోవ‌డంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్‌శ‌ర్మ‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కొంద‌రు మాజీలు అభిప్రాయ‌ప‌డుతుండ‌గా.. మ‌రికొంద‌రు టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానేకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్న‌ర్ బ్రాడ్‌హాగ్ ఓ అడుగు ముందు‌కు వేసి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్‌కు జ‌ట్టులో చోటే క‌ష్టమ‌ని.. ఇంకా కెప్టెన్సీ ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించాడు. విదేశాల్లో ఇంత వ‌ర‌కు రోహిత్ రాణించింది లేద‌ని.. టెస్టుల్లో ఓపెన‌ర్‌గా రోహిత్ ప్ర‌మోట్ పొందాక అద‌ర‌గొడుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు స్వ‌దేశంలోనే ఆడాడ‌ని అన్నారు. విదేశాల్లో రోహిత్ స‌గ‌టు బాలేద‌ని పేర్కొన్నాడు. టెస్టు వైస్ కెప్టెన్ ర‌హానే అప్ప‌గిస్తే.. ఆ బాధ్య‌త‌లు చ‌క్క‌గా నిర్వ‌ర్తించ‌గ‌ల‌డ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. 'రోహిత్ ఇటీవల జరిగిన టెస్టుల్లో గొప్పగా రాణించాడు. కానీ అదంతా స్వదేశంలో. ఇప్పుడు ఆడబోతోంది ఆస్ట్రేలియాలో. రోహిత్‌కు ఇప్పటివరకు విదేశాల్లో జరిగిన టెస్టుల్లో అంతగా రాణించలేదు. జట్టులో అతడు స్థానం నిలబెట్టుకోవడమే కష్టం, అలాంటి వ్యక్తికి కెప్టెన్సీ ఎలా ఇస్తారు' అని ప్రశ్నించాడు. రహనేకు కెప్టెన్సీ అప్పగిస్తే.. రోహిత్ త‌న బ్యాటింగ్‌పై మ‌రింత దృష్టిపెట్టేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపాడు. విరాట్ కోహ్లీ లేక‌పోవ‌డం భారత్‌కు ఇబ్బందే. కాగా.. విరాట్ లేని లోటు రోహిత్ శ‌ర్మ తీర్చ‌లేడ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

దాదాపు మూడు నెల‌ల సుదీర్ఘ ప‌ర్య‌ట‌న కోసం 25 మందితో కూడిన భార‌త బృందం గ‌త‌వారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఆసీస్ దేశ నిబంధ‌న‌ల ప్ర‌కారం టీమ్ఇండియా ఆట‌గాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటూనే ప్రాక్టీస్ మొద‌లు పెట్టారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, నాలుగు టెస్టులు ఆడ‌నుంది.


Next Story