Bhuvneshwar Kumar And His Wife in Quarantine After Displaying COVID-19 Symptoms. టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో
By Medi Samrat Published on 1 Jun 2021 11:04 AM GMT
టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. భువీతో పాటు అతని భార్య నుపుర్ నగర్, తల్లి ఇంద్రేష్లోనూ కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో భువనేశ్వర్ కుమార్, అతని భార్య ఇంట్లోనే ఐసొలేషన్లోకి వెళ్లగా.. తల్లిని మీరట్లోని దయావతి కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
ఇదిలావుంటే.. ఇటీవలే భువి తండ్రి కిరణ్ పాల్ సింగ్ కిందటి నెల 20వ తేదీన మరణించారు. కాలేయ వ్యాధితో బాధపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటన చోటు చేసుకున్న రెండువారాల్లోపే కుటుంబం మొత్తం వైరస్ బారిన పడటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. ఇక భువీ ఈ మధ్యకాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోన్నాడు. ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్ 2021లోనూ విఫలమయ్యాడు. ఫలితంగా భారత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సహా.. ఇంగ్లాండ్లో పర్యటించాల్సిన భారత జట్టులో అతనికి చోటు దక్కలేదు.