అర్చకులకు కరోనా పాజిటివ్.. రమణ దీక్షితులు సంచలన ట్వీట్
By తోట వంశీ కుమార్ Published on 16 July 2020 2:52 PM IST
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ట్వీట్ చేశారు. స్వామి వారి కైంకర్యాలు నిర్వహించే 50 మంది అర్చకులలో 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్గా తేలిందని, మరో 25 మంది అర్చకులకు కరోనా పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందన్నారు. దర్శనాలను నిలిపేయడానికి ఈవో, ఏఈవో లు అంగీకరించడం లేదని చెప్పారు. ఈవో, ఏఈవోలు చంద్రబాబు విధానాలనే కొనసాగిస్తున్నారని, ఇలాగే కొనసాగితే అతి పెద్ద ఉపద్రవాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుందని రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్ను సీఎం జగన్కు కూడా ట్యాగ్ చేశారు.
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. తిరుమలలో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అర్చకులు కూడా ఎక్కువగా వైరస్ బారిన పడుతుండడంపై అర్చక బృందం చైర్మన్ సుబ్బారెడ్డిని కలిసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వైరస్ వ్యాప్తి ఆగటం లేదని, క్యూలైన్లో అర్చకులు విధులు నిర్వహించకున్నా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉందన్నారు. అర్చకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బదిలి సౌకర్యం కల్పించాలని కోరారు.