ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. టీఆర్ఎస్ ఓటమి ఖాయం
Vijayashanti Fires On TRS. ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంసిద్ధతపై ప్రశ్నిస్తే కేసీఆర్ ప్రభుత్వం.. తమ వల్
By Medi Samrat Published on 3 Aug 2021 12:38 PM GMT
ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంసిద్ధతపై ప్రశ్నిస్తే కేసీఆర్ ప్రభుత్వం.. తమ వల్ల కాదని తప్పించుకుని మంచి గాలప్ మీద భాగ్ మిల్కా లెక్క ఉరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినకుండా.. మిలియన్ల సంఖ్యలో ఓటర్లు పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్పోరేషన్ ఎన్నికలు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించారు అన్నారు. అయితే.. ఇప్పుడు కేవలం 100కు పైన ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వెయ్యాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పించుకుని వాయిదా వేసే ప్రయత్నం కేవలం హుజురాబాద్ ఎన్నిక వస్తుందన్న భయంతో మాత్రమేనని ఎద్దేవా చేశారు.
ఇంకా సమయం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తెచ్చి, నాయకులను కొనుగోలు చేసి, బీజేపీ కార్యకర్తలను ఒత్తిళ్ళకు గురి చేసే విధంగా కేసులు, వేధింపులు చేపట్టి, ప్రజలను భయభ్రాంతులను చేసి, ఎలాగైనా గెలవాలన్న దుర్మార్గపు ఆలోచనలో భాగంగానే ఈ పలాయనవాదాన్ని ప్రస్తుతానికి అడ్డు పెట్టుకున్నట్లుందని విమర్శించారు. ఈ పనులన్నింటి ద్వారా ఇప్పటికే జనం దృష్టిలో తేలికైపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. మరింత నవ్వుల పాలు కాక తప్పదని జోష్యం చెప్పారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలుపు, టీఆర్ఎస్ ఓటమి ఖాయం అని అన్నారు. ఇప్పటిదాకా చేసిన.. చేస్తున్న అరాచక కార్యాచరణ వల్ల టీఆర్ఎస్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నైతికంగా ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు.