గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేస్తోంది: కిషన్‌రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  6 April 2024 5:36 AM GMT
bjp, kishan reddy, comments,  telangana, congress, brs ,

గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేస్తోంది: కిషన్‌రెడ్డి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి రాజకీయ పార్టీలు. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఆట మొదలైందని చెప్పిన ఆయన.. గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీలో చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణలో కనుమరుగు కాబోతుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించబోతుందని చెప్పారు. ఫిర్‌ ఏక్‌ మోదీ సర్కార్‌ అని ప్రజలు అంటున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ విశ్వవిజేత అని... ప్రపంచానికి ఆయనే మార్గదర్శనం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్‌ ఉందని చెప్పారు. రెండు దఫాలుగా ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్‌ పార్టీ రాష్ట్రంలో మెల్లిగా కనుమరుగు అవుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కొంత మేర పుంజుకున్నా.. ఇంతకంటే ఎదగలేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ద్వారా బీజేపీ సత్తా చాటబోతుందని అన్నారు. తెలంగాణలో అసలైన ఆట మొదలైందని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్‌ గారడీలు చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డికి దృష్టి లేదని విమర్శించారు. వారు ఎక్కుగా ఇతర పార్టీలకు చెందిన వారిని తమ పార్టీలో చేర్చుకోవడంలో దృష్టి పెట్టారని అన్నారు. తెలంగాణలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్‌లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్నామనీ.. అయోధ్యలో రామాలయం పూర్తి చేశామని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోందని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి.. గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు.

Next Story