'కాఫీ' క‌థ విన్నారా.? భార‌తీయులు ఎలా, ఎప్పుడు రుచి చూశారో తెలుసా.?

నేడు కాఫీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ప్రతి ఒక్కరూ దాని రుచికి దాసోహ‌మ‌వ‌క త‌ప్ప‌దు.

By Medi Samrat  Published on  1 July 2024 11:36 AM GMT
కాఫీ క‌థ విన్నారా.? భార‌తీయులు ఎలా, ఎప్పుడు రుచి చూశారో తెలుసా.?

నేడు కాఫీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. ప్రతి ఒక్కరూ దాని రుచికి దాసోహ‌మ‌వ‌క త‌ప్ప‌దు. రోజు ప్రారంభం నుంచి మొద‌లుకుని.. పని ఒత్తిడి నుంచి తేలిక‌య్యేందుకు.. నిద్రపోయే ముందు మానసిక అలసట నుండి ఉపశమనం పొందేందుకు.. ప్రతీ సందర్భంలో మ‌నుషులు కాఫీ సిప్ స్నేహాన్ని కోరుకుంటున్నారు.

అయితే కాఫీపై ఈ అభిరుచి ఎప్పుడూ ఉందా? ప్రారంభంలో చాలా మంది మత పెద్దలు దీనిని నిషేధించాలని ప్రయత్నించారట‌. అలాంటి ప‌రిస్థితుల నుంచి నేడు చాలా మంది హృదయాలను తాకిన కాఫీ గురించి ఆసక్తికరమైనవిష‌యాలు తెలుసుకుందాం.

నేడు, బ్లాక్ కాఫీతో పాటు, కాపుచినో, లాట్టే, ఎస్ప్రెస్సో, ఇటాలియన్ ఎస్ప్రెస్సో, అమెరికనో, టర్కిష్, ఐరిష్ ప్రపంచవ్యాప్తంగా ప‌లు ర‌కాల కాఫీల‌ను తాగుతూ ఆనందిస్తున్నాం. మార్కెట్‌లో అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లు ఉన్నాయి. వీధుల్లో ఉండే టీ విక్రేతలు కూడా కాఫీ డిమాండ్‌ను తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే.. కాఫీ ఎక్కడ మొదలైందో తెలుసా.?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీని 9వ శతాబ్దంలో ఇథియోపియా ప్రజలు గుర్తించారు. కాఫీ గురించి ఒక పురాణ క‌థ‌ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఒక కొండపై ఉన్న ఓ గ్రామంలో ఒక గొర్రెల కాపరి తన మేకలు పొదల్లో ఉన్న కొన్ని బెర్రీలు తినడం చూశాడు. తిన్న‌ తర్వాత ఆ మేకలు శక్తిని పొంది దూకడం ప్రారంభించాయి. ఉత్సుకతతో కాప‌రి కూడా కొన్ని బెర్రీలను తినడానికి ప్రయత్నించాడు. కొంత సమయం తర్వాత అతనికి రిఫ్రెష్‌గా అనిపించింది. వాటిని తిన్న త‌ర్వాత‌ రోజులో అతను అనుభవించిన అలసటలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. ఈ ఘటనే కాఫీకి చాలా గుర్తింపు తెచ్చిపెట్టిందని అంటున్నారు.

టర్కీ రాయబారిగా ఉన్న సులేమాన్ అగా ప్యారిస్ రాజభవనానికి కాఫీని పరిచయం చేశాడని చెబుతారు. ఆ త‌ర్వాతే.. ఇక్కడి ప్రజలు కాఫీ గురించి ఎంతగా వెర్రితలలు వేశారు అంటే.. 1715 సంవత్సరం నాటికి ఒక్క లండన్‌లోనే 2,000 కాఫీ హౌస్‌లు ప్రారంభించబడ్డాయి.

ఇదిలావుంటే.. చాలా మంది పండితులు వీటిని కాఫీ హౌస్‌ల కంటే అధ్వాన్నమైన ప్రదేశాలుగా పిలిచేవారు. ఇవి కేవలం సామాజిక, రాజకీయ చర్చలకు వేదికలని వారు విశ్వసించేవారు. 1675లో చార్లెస్ II కూడా కాఫీ హౌస్‌లలో అసమ్మతివాదులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తులు మాత్రమే కనిపిస్తారని చెప్పారు. అటువంటి పరిస్థితితుల‌లో కాఫీ షాపుల‌ను నిషేధించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి.

13వ శతాబ్దంలో యెమెన్‌లో కాఫీ తాగడం ప్రారంభమైందని నమ్ముతారు. సూఫీలు.. వారి మతపరమైన అనుచరులు కాఫీ గింజ‌ల‌ను గ్రైండ్‌ చేసి, ఆపై నీటిలో ఉడకబెట్టి తీసుకోవ‌డం ప్రారంభించారు. వీటిని తీసుకోవ‌డం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. మతపరమైన చర్చల సమయంలో మనస్సును ఏకాగ్రతతో, ప్రశాంతంగా ఉంచుతుందని న‌మ్మేవారు. దీంతో కాఫీ శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఈ పానీయం బాగా ప్రాచుర్యం పొందింది. అరేబియా అంతటా కాఫీ హౌస్‌లు తెరవడం ప్రారంభించారు. ఆ త‌ర్వాత‌ 16వ, 17వ శతాబ్దాల మధ్య మక్కా, ఈజిప్ట్, టర్కీ వంటి అనేక అరబ్ దేశాలు ఈ కాఫీ హౌస్‌లను నిషేధించాయని.. అయితే అవి మూసివేసిన వేగం కంటే రెట్టింపు వేగంతో తెరుచుకున్నాయని చెబుతారు.

17వ శతాబ్దం చివరి వరకు కాఫీ పంట‌ ఉత్తర ఆఫ్రికా, అరబ్ దేశాలలో మాత్రమే సాగు చేయబడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని సాగు సూత్రం తమ దేశం నుండి బయటకు వెళ్లకుండా చూసుకోవాల‌నేది అక్క‌డి వ్యాపారుల ప్రయత్నం. అరబ్ దేశాల వెలుపల కాఫీని ఉడకబెట్టడం లేదా కాల్చిన తర్వాత మాత్రమే తీసుకోవ‌డం కనిపించేది.. ఈ కారణంగా కాఫీ విత్తనాలు సాగుకు సరిపోవని న‌మ్మేవారు.

1600 ప్రాంతంలో ఒక సూఫీ యాత్రికుడు బాబా బుడాన్ అరేబియా నుండి ఏడు కాఫీ గింజలను దొంగిలించి తనతో పాటు భారతదేశానికి తీసుకువచ్చాడని నిపుణులు చెబుతున్నారు. కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాకు చెందిన ఇతడు.. ఈ విత్తనాలను తన నడుముకు కట్టుకుని భారత్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. ఆ తరువాత అతడు వాటిని దక్షిణ భారతదేశంలోని మైసూర్‌లో నాటగా.. మొదటిసారిగా భారతదేశ ప్రజలు కాఫీని రుచి చూశారని చెబుతుంటారు.

Next Story