సింగర్ జుబిన్ గార్గ్ది హత్యే.. అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు
సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By - Medi Samrat |
సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జుబీన్ మరణం ప్రమాదవశాత్తు జరిగినది కాదని.. సింగపూర్లో ముందస్తు ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆయన అన్నారు.
అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్(52) సెప్టెంబర్ 20న సింగపూర్లో జరిగే ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లారు. అయితే.. సెప్టెంబరు 19న ఈవెంట్కు ముందు రోజు రాత్రి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ మరణించారు.
జుబీన్ మృతి కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రతిపాదన చేసింది. విపక్షాల ప్రశ్నలకు హిమంత బిస్వా శర్మ స్పందిస్తూ.. ఇది ప్లాన్ ప్రకారం సాధారణంగా జరిగిన ఓ హత్య అన్నారు.
నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ (NEIF) సెప్టెంబర్ 20న సింగపూర్లో జరిగింది. ఈ ఈవెంట్లో పాడేందుకు జుబీన్ సింగపూర్ వెళ్లారు. సెప్టెంబరు 19 రాత్రి స్విమ్మింగ్ పూల్లో జుబీన్ మృతదేహం తేలడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జుబీన్ మరణానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు . ఆయన మద్దతుదారులు న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు.
జుబీన్ మృతిపై దర్యాప్తు చేసేందుకు అస్సాం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా 60కి పైగా కేసులు నమోదయ్యాయి. గౌహతి హైకోర్టు కూడా దర్యాప్తు కోసం ఏక సభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది.
ఎన్ఇఐఎఫ్ ఆర్గనైజర్ శ్యామ్కను మహంత, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, బంధువు సందీపన్ గార్గ్ సహా ఏడుగురిని పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నారు. జుబీన్ హత్యలో వీరందరి హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సిట్ కేసు దర్యాప్తు చేస్తోంది.