కర్ణాటక రాసలీలల సీడీ స్కామ్ లో కొత్త మలుపు
Woman releases third video saying she will file a complainant against Jarkiholi. కర్ణాటకలో రాసలీలల సీడీ స్కామ్ కొత్త మలుపు తిరిగింది.
By Medi Samrat Published on 27 March 2021 3:46 AM GMT
కర్ణాటకలో రాసలీలల సీడీ స్కామ్ కొత్త మలుపు తిరిగింది. తాజాగా శుక్రవారం బాధిత యువతి తన న్యాయవాది ద్వారా మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే రమేష్ జార్జిహోళిపై ఫిర్యాదు చేశారు. యువతి తరుపున లాయర్ కెఎన్ జగదీష్ కుమార్ బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ను కలిసి ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే కుబ్బన్ పార్క్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కమిషనర్ న్యాయవాదికి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి, తనపై లైంగిక వేధింపులు, మోసం, బెదిరింపులకు ఎమ్మెల్యే రమేష్ పాల్పడ్డాడని యువతి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం రెండో వీడియో విడుదల చేసిన యువతి, తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఈ కేసులో సిట్ దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని ఆరోపించారు.
బెంగళూరులోని ఆర్టీ నగరలో నివాసం ఉండే యువతి రాష్ట్రంలోని డ్యామ్లను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి డాక్యుమెంటరీ తీసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రిని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఆ యువతి పట్ల సదరు మంత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించి సీడీని బయటకు రావడంతో కర్ణాటక వ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తించింది.
అయితే బాధితురాలు ముందు పోలీసులను ఆశ్రయించి ఇప్పుడు ప్రతిపక్ష నేతలను ఎందుకు రక్షణ కోరుతున్నారో తెలియట్లేదని హోం మంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని, సిట్కు పూర్తి అధికారాలు ఇచ్చామని చెప్పారు. మాజీ మంత్రిని సిట్ అధికారులు రెండుసార్లు విచారించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
కాగా, రాసలీలల సీడీ విషయంలో గందరగోళంతో బడ్జెట్ సమావేశాలు బుధవారమే ముందస్తుగా ముగిశాయి. మాజీ మంత్రిపై చర్యల కోసం కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, నేతలు గురువారం కూడా ఆందోళనలు కొనసాగించారు.
ఇదిలావుంటే, ఆ యువతి ఒత్తిడిలో ఉండి ఆరోపణలు చేస్తున్నారని మాజీమంత్రి రమేశ్ జార్ఖిహొళి ఆరోపించారు. ఆమె వెనుక ఎవరున్నారో తనకు తెలుసని, సకాలంలో అన్ని ఆధారాలతో బయటపెడతానని రమేశ్ ప్రకటించారు. తనకు వ్యతిరేకంగా మరో పది సీడీలు విడుదల చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఒక మహా నాయకుడే ఈ కుట్రకు సూత్రధారి అని వ్యాఖ్యానించిన మాజీ మంత్రి.. మరికొన్ని రోజుల్లో అన్నింటినీ బహిరంగ పరుస్తానని చెప్పారు.