మాల్యా విలాసవంతమైన బంగ్లా.. సొంతం చేసుకున్న హైదరాబాద్ సంస్థ

Vijay Mallya’s Kingfisher House sold for Rs 52 crore. లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  14 Aug 2021 2:15 PM GMT
మాల్యా విలాసవంతమైన బంగ్లా.. సొంతం చేసుకున్న హైదరాబాద్ సంస్థ

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్న సంగతి తెలిసిందే..! ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ చేజిక్కించుకుంది. ఎయిర్‌లైన్స్‌ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డ సంగతి తెలిసిందే..! దీంతో డబ్బు కట్టలేక విదేశాలకు చెక్కేశాడు విజయ్ మాల్యా.. దీంతో కోర్టులకు ఎక్కిన బ్యాంకులకు తమ అప్పుల కింద విజయ్‌ మాల్యా ఆస్తులను వేలానికి వేసేలా తీర్పు వచ్చింది.

ముంబై ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్‌ ఫిషర్‌ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బేస్‌ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది. మరో వైపు విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే పనులు వేగంగా జరిగిపోతూ ఉన్నాయి.

విజయ్ మాల్యాకు ఇటీవలే లండన్ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. మాల్యా దివాలా తీసినట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వున్న మాల్యా ఆస్తులను భారతీయ బ్యాంకులు స్వాధీనం చేసుకోవచ్చు. ఈ మేరకు లండన్ హైకోర్టు న్యాయమూర్తి మైకేల్ బ్రిగ్స్ కీలక తీర్పు వెలువరించారు.


Next Story