ఢిల్లీ నుండి కాన్పూర్ కు అలా ఎలా వెళ్ళావయ్యా.. అరెస్ట్ చేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన 30 ఏళ్ల దిలీప్ కుమార్ అనే వ్యక్తి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పై ఐదు గంటలపాటు పడుకుని ఢిల్లీ నుండి కాన్పూర్‌కు ప్రయాణించాడు.

By Medi Samrat  Published on  5 April 2024 10:34 AM GMT
ఢిల్లీ నుండి కాన్పూర్ కు అలా ఎలా వెళ్ళావయ్యా.. అరెస్ట్ చేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందిన 30 ఏళ్ల దిలీప్ కుమార్ అనే వ్యక్తి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పై ఐదు గంటలపాటు పడుకుని ఢిల్లీ నుండి కాన్పూర్‌కు ప్రయాణించాడు. అయితే ఇది తెలియడంతో అధికారులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి దిలీప్ తన స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వద్ద రైలు ఎక్కాడు. ట్రైన్ లో సీట్లు అందుబాటులో లేకపోవడంతో పైకప్పుపైనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు.

గంటకు 130 కి.మీ వేగంతో రైలు ప్రయాణించింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంటలకు కాన్పూర్ చేరుకుంది. రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి రాగానే టాప్ మీద ఎవరో పడి ఉండడం చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. రైలు పట్టాలపై ఉన్న విద్యుత్ లైన్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి అతన్ని సురక్షితంగా కిందకు దించడానికి ప్రయత్నించారు రైల్వే అధికారులు. దిలీప్ కు కొన్ని అడుగుల ఎత్తులో 11,000 వోల్టుల ఎలక్ట్రిక్ లైన్‌ ఉంది. అది అతడికి తాకి ఉంటే క్షణాల్లో ప్రాణాలు పోయి ఉండేవి. కాన్పూర్ సెంట్రల్‌లో రైలు కోచ్ పైకప్పుపై పడుకుని కనిపించాడని ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) ఇన్‌స్పెక్టర్ అనిల్ శర్మ తెలిపారు. రైల్వే అధికారులు అతడిని బలవంతంగా కిందకు దించారు. ఆపై ప్రయాగ్‌రాజ్‌లోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అక్కడ అతనికి జరిమానా విధించి విడుదల చేశారు. రైలులో సీట్లు అందుబాటులో లేనందున తాను రైలు పైకప్పుపై ప్రయాణించినట్లు దిలీప్ కుమార్ వెల్లడించాడు. ప్రయాణంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో అలా చేయడం తనకు హాయిగా అనిపించిందని కూడా చెప్పాడు.

Next Story