త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. త్రిపుర అసెంబ్లీ సమావేశాలు ఈ ఏడాది మార్చి 22తో ముగియనున్నాయి.
త్రిపుర శాసనసభలో 60 మంది సభ్యుల బలం ఉంది. 2018 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో BJP-ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT) కూటమి 60 మంది సభ్యుల సభలో మూడింట రెండు వంతుల మెజారిటీని గెలుచుకుని.. రాష్ట్రంలో 25 ఏళ్ల వామపక్ష పాలనకు ముగింపు పలికింది. 60 సీట్లలో బిజెపి 35, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 16, ఐపిఎఫ్టి 8 స్థానాలలో గెలిచాయి. కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా త్రిపురలో 3,328 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి.
ఈసారి వామపక్ష-కాంగ్రెస్ కలయికతో పాటు తృణమూల్ కాంగ్రెస్తో అధికార బీజేపీ త్రిముఖ పోటీని ఎదుర్కోనుంది. 60 మంది సభ్యుల అసెంబ్లీలో బిజెపికి 34 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. దాని మిత్రపక్షమైన ఐపిఎఫ్టికి ఐదుగురు ఉన్నారు.
రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించిన తర్వాత బిప్లబ్ దేవ్ ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ పనితీరు సమస్యల కారణంగా 2022 మే లో పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కొత్త సీఎంగా డాక్టర్ మాణిక్ సాహాను పార్టీ ఎన్నుకుంది.