అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గుహవాటిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. గత నెలలో కరోనా బారిన పడిన ఆయన ఈ మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికి ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో శరీరంలోని అవయవాల పనితీరు క్షీణించడంతో వెంటిలేటర్పైనే ఉంచారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
తరుణ్ గొగోయ్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో దిబ్రుగఢ్ నుంచి గువాహటికి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు.
ఇప్పటివరకు భావిస్తున్న దాని ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని శ్రీమంత శంకర్ దా కళాక్షేత్రం లో ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఆయన అస్సాం రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 84 వేల ఏళ్ళ వయసున్న ఆయనకు 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ లో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆరు సార్లు ఎంపీగా కూడా ఆయన ఎన్నికయ్యారు.