ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు 23 మందిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడంతో రాజకీయాలు మరింత ముదిరాయి. కోర్టు నిర్ణయం తర్వాత బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పాట్నా విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన తేజస్వి యాదవ్.. రాజకీయ ప్రతీకారంతో ప్రతిపక్ష నాయకులను ఇరికిస్తున్నారని అన్నారు. ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేయడానికి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ నాయకుడైనా అనవసరంగా కేసులలో చిక్కుకుంటే.. అది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తే.. ప్రజలకు మళ్ళీ న్యాయమైన అవకాశం లభించాలని తేజస్వి అన్నారు.
కోర్టు నిర్ణయం బీజేపీ "స్వభావం, వ్యక్తిత్వం, ముఖాన్ని" బయటపెట్టిందని తేజస్వి యాదవ్ అన్నారు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు.. కేంద్రానికి, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న విస్తృత రాజకీయ యుద్ధంలో భాగం అన్నారు. ఐఆర్సిటిసి కేసు, 'ఉద్యోగానికి భూమి' ఎపిసోడ్ను ప్రస్తావిస్తూ తేజస్వి మాట్లాడుతూ.. అనేక దర్యాప్తులు చేసినప్పటికీ, ఎటువంటి స్కామ్ నిరూపించబడలేదని అన్నారు. కేసును మూడుసార్లు తిరిగి విచారణకు తీసుకుంటున్నారని, ఇది రాజకీయ ఉద్దేశాలను సూచిస్తోందని ఆయన పేర్కొన్నారు. చివరికి న్యాయం జరుగుతుందని, సత్యం గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.