రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు, బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. శనివారం తెల్లవారుజామున వైశాలి జిల్లాలో వేగంగా వస్తున్న ట్రక్కు కాన్వాయ్లోని రెండు వాహనాలను ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో యాదవ్ కు ఎలాంటి గాయాలు అవ్వలేదు.
పాట్నా-ముజఫర్పూర్ జాతీయ రహదారిపై గోరౌల్ సమీపంలో తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది, యాదవ్, అతని బృందం ఒక కార్యక్రమం తర్వాత మాధేపుర నుండి పాట్నాకు తిరిగి వస్తుండగా కాన్వాయ్ టీ కోసం ఆపారు. ఇంతలో స్పీడ్ గా వచ్చిన ట్రక్కు కాన్వాయ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి స్థిరంగా ఉంది. “మేము టీ కోసం ఆగి ఉండగా, వేగంగా వచ్చిన ఓ ట్రక్కు నా కాన్వాయ్లోని రెండు వాహనాలను ఢీకొట్టింది. నా కారు కేవలం ఐదు అడుగుల దూరంలో ప్రమాదం జరిగింది. నేను వెంటనే జిల్లా పోలీసులను, అధికారులను సంప్రదించాను” అని తేజస్వి యాదవ్ విలేకరులకు తెలిపారు.