సుశాంత్‌ను నువ్వే చంపావు.. చంపేస్తానంటూ మంత్రికి బెదిరింపులు.. అరెస్ట్‌

Sushant Singh Rajput's 'fan' arrested in Bengaluru for threatening Aaditya Thackeray. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపు మెసేజ్‌లు

By Medi Samrat  Published on  23 Dec 2021 10:36 AM GMT
సుశాంత్‌ను నువ్వే చంపావు.. చంపేస్తానంటూ మంత్రికి బెదిరింపులు.. అరెస్ట్‌

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపు మెసేజ్‌లు పంపినందుకు గాను, దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమాని అయిన‌ బెంగళూరుకు చెందిన 34 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. 2020లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హత్యకు మహారాష్ట్ర పర్యాటక, పర్యావరణ మంత్రి అయిన ఆదిత్య ఠాక్రేని నిందిస్తూ డిసెంబర్ 8న వాట్సాప్ మేసేజ్‌ల‌ ద్వారా బెదిరింపులు వ‌చ్చాయి. "నువ్వు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను చంపావు"..అని నిందితుడు జైసింగ్ రాజ్‌పుత్ మొద‌టి మెసేజ్ పంపాడు.

నిందితుడు ఆదిత్యకు మూడుసార్లు ఫోన్ చేశాడ‌ని పోలీసులు తెలిపారు. స్పందన లేకపోవడంతో వాట్సాప్‌లో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. సైబర్ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని పొరుగున ఉన్న కర్ణాటకలోని బెంగళూరులో గుర్తించారు. దీంతో బెంగళూరుకు ఒక బృందాన్ని పంపి అనుమానితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని ప‌లు సెక్షన్లు కింద FIR నమోదు చేయబడింది. నిందితుడిని బెంగుళూరులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తీసుకువచ్చారు. స్థానిక కోర్టు నిందితుడికి డిసెంబర్ 23 వరకు పోలీసు కస్టడీ విధించింది.

ఇదిలావుంటే.. గతేడాది జూన్ 14న నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన ఫ్లాట్‌లో శవమై కనిపించాడు. సుశాంత్ తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు.. బీహార్ ప్రభుత్వ సిఫార్సు మేరకు.. దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేపట్టింది. సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)లు ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు, డ్రగ్స్ కోణంపై విచారణ జరుపుతున్నాయి.


Next Story