గుండెపోటుతో సులభ్ కాంప్లెక్స్‌ల‌ వ్య‌వ‌స్థాప‌కుడు మృతి

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 15 Aug 2023 6:25 PM IST

గుండెపోటుతో సులభ్ కాంప్లెక్స్‌ల‌ వ్య‌వ‌స్థాప‌కుడు మృతి

సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. మంగ‌ళ‌వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. వైద్యులు అక్క‌డ ఆయ‌న‌ చనిపోయినట్లు ప్రకటించారు. బిందేశ్వర్ పాఠక్‌కు గుండెపోటు వచ్చిందని అతని సన్నిహితుడు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం పాఠక్ జాతీయ జెండాను ఆవిష్కరించారని.. కొద్దిసేపటికే కుప్పకూలిపోయారని సహాయకుడు తెలిపారు. అనంతరం ఆయ‌న‌ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించగా.. మధ్యాహ్నం 1.42 గంటలకు ఆయన చనిపోయినట్లు ప్రకటించారు.

బిందేశ్వర్ పాఠక్ సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. సామాజిక కార్యకర్త, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో అగ్రగామి అయిన బిందేశ్వర్ పాఠక్ వయస్సు 80 సంవత్సరాలు. సులభ్ ఇంటర్నేషనల్ భారతదేశంలోని ఒక సామాజిక సేవా సంస్థ. ఈ సంస్థ మానవ హక్కులు, పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, విద్య ద్వారా సంస్కరణలను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది.

బిందేశ్వర్ పాఠక్ 1970లో సులభ్ ఇంటర్నేషనల్‌ను స్థాపించారు. ఈ సంస్థ‌ భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. సులభ్ ఇంటర్నేషనల్ దేశవ్యాప్తంగా దాదాపు 8500 టాయిలెట్లు, బాత్‌రూమ్‌లను కలిగి ఉంది. సులభ్ ఇంటర్నేషనల్ టాయిలెట్‌ని ఉపయోగించేందుకు 5 రూపాయలు, స్నానానికి 10 రూపాయలు వసూలు చేస్తారు.

Next Story