దేశంలోని మరేదైనా జైలుకు త‌ర‌లించండి..!

ఆర్థిక నేర‌గాడు సుఖేష్ చంద్రశేఖర్‌ను మండోలి జైలు నుంచి తరలించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

By Medi Samrat  Published on  19 May 2024 3:25 PM GMT
దేశంలోని మరేదైనా జైలుకు త‌ర‌లించండి..!

ఆర్థిక నేర‌గాడు సుఖేష్ చంద్రశేఖర్‌ను మండోలి జైలు నుంచి తరలించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ప్రభుత్వం) అధికారంలో లేని పంజాబ్, ఢిల్లీ మినహా దేశంలోని మరేదైనా జైలుకు.. మండోలి జైలు నుంచి తరలించాలని సుకేష్ పిటిషన్‌లో కోరారు. జస్టిస్ బేల త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ సందర్భంగా.. ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నోటీసులకు జులై 19లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం కోరింది.

సుకేష్‌ను మండోలి జైలులో సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. సుకేష్ చంద్రశేఖర్ ఫిర్యాదుపై మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌పై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేశారని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా సుకేష్‌ను మండోలి జైలు నుంచి ఢిల్లీ వెలుపల జైలుకు తరలించాలన్న సుకేష్ భార్య విజ్ఞప్తిని కూడా కోర్టు గతేడాది తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్ట్ కావడం గమనార్హం. సత్యేందర్ జైన్‌కు రూ.10 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు రూ.50 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో తీహార్ జైలులో ఉన్న సుకేష్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నారు.

Next Story