ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానేయాలని, లేకుంటే భౌగోళిక ఉనికిని కోల్పోతారని పాకిస్థాన్కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మ్యాప్లో పాకిస్థాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే, ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని అరికట్టాల్సి ఉంటుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు.
రాజస్థాన్లోని అనుప్గఢ్లో జనరల్ ద్వివేది మాట్లాడుతూ.. "ఒక దేశంగా భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఈసారి మేము ఆపరేషన్ సిందూర్ 1.0 లాగా సంయమనం పాటించము. ఈసారి మేము ఏదో ఒకటి చేస్తాం, పాకిస్తాన్ భౌగోళికంగా ఉండాలనుకుంటుందా లేదా అని ఆలోచించుకోవాలి. పాకిస్తాన్ భౌగోళికంగా మనుగడ సాగించాలనుకుంటే, అది ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలి.
సైనికులు కూడా సిద్ధంగా ఉండాలని కోరారు. ఆర్మీ చీఫ్, "దేవుడు కోరుకుంటే, మీకు త్వరలో అవకాశం వస్తుంది. శుభాకాంక్షలు" అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని ప్రపంచానికి భారత్ ఆధారాలు ఇచ్చిందని జనరల్ ద్వివేది అన్నారు. ఈ సాక్ష్యాలను భారత్ బయటపెట్టి ఉండకపోతే పాకిస్థాన్ ఇదంతా దాచి ఉండేదని అన్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినప్పుడు ప్రపంచం మొత్తం అండగా నిలిచిందని ఆర్మీ చీఫ్ చెప్పారు.
మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా తయారు చేసిన ఎఫ్-16, చైనీస్ జెఎఫ్-17తో సహా నాలుగైదు పాకిస్థానీ యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చివేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చెప్పగా.. జనరల్ ద్వివేది ఈ హెచ్చరిక చేశారు.