శవాలై కనిపించిన అక్కాచెల్లెళ్లు..పక్కనే తల్లి
ఢిల్లీలో జంట మరణాలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇద్దరు అక్కచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు.
By - Knakam Karthik |
శవాలై కనిపించిన అక్కాచెల్లెళ్లు..పక్కనే తల్లి
ఢిల్లీలో జంట మరణాలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. ఇద్దరు అక్కచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. వారి వయస్సు సుమారు 33 మరియు 28 ఏళ్లు ఉంటుందని గుర్తించారు పోలీసులు. అదే ఇంట్లో వారి తల్లి అపస్మారక స్థితిలో పడి కనిపించింది. ఒక మహిళ మృతదేహం ముఖంపై దిండు ఉన్నట్లు గుర్తించగా, మరో మహిళ మృతదేహం వేరే గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది.
దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 33 మరియు 28 ఏళ్ల వయస్సు గల ఇద్దరు మహిళలు మరణించి ఉండగా, వారి 55 ఏళ్ల తల్లి అపస్మారక స్థితిలో పడి ఉంది. తల్లి తన ఇద్దరు కుమార్తెలను చంపి, ఆపై ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాతే అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.
గురువారం సాయంత్రం సుమారు 6:10 గంటలకు ఒక ఇంటి తలుపు లోపల నుండి లాక్ చేసి ఉందని, ఎంత పిలిచినా తెరవడం లేదని పోలీసులకు పీసీఆర్ కాల్ వచ్చింది. ఢిల్లీ పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఒక గదిలో ఓ యువతి ముఖంపై దిండు పెట్టి ఉండగా శవమై కనిపించింది. మరో గదిలో ఇంకో యువతి మెడకు తాడు బిగించి ఉంది.
మరో గదిలో 55 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారి తల్లి అపస్మారక స్థితిలో ఉండగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రాణాలతోనే ఉండటంతో వెంటనే ఎయిమ్స్ (AIIMS) ట్రామా సెంటర్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రాథమిక విచారణ ప్రకారం, తల్లి తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసి, ఆ తర్వాత తానూ ప్రాణం తీసుకోవాలని ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.