డాబా బయట మాటేశారు.. లిక్కర్ వ్యాపారి బయటకు రాగానే..!

ఆదివారం హర్యానాలోని సోనిపట్‌లోని డాబా వెలుపల మద్యం వ్యాపారిపై కాల్పులు జరిగాయి.

By Medi Samrat  Published on  10 March 2024 3:45 PM GMT
డాబా బయట మాటేశారు.. లిక్కర్ వ్యాపారి బయటకు రాగానే..!

ఆదివారం హర్యానాలోని సోనిపట్‌లోని డాబా వెలుపల మద్యం వ్యాపారిపై కాల్పులు జరిగాయి. మృతుడిని సుందర్ మాలిక్‌గా గుర్తించారు. అతడిని చంపిన విజువల్స్ కెమెరాలో చిక్కుకున్నాయి. గుల్షన్ డాబా వెనుక పార్కింగ్ స్థలంలో ఇద్దరు వ్యక్తులు సుందర్ మాలిక్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. సుందర్ మాలిక్‌పై ముష్కరులు 35 రౌండ్లకు పైగా బుల్లెట్లు కాల్చారు.

హర్యానాకు చెందిన గ్యాంగ్‌స్టర్.. హిమాన్షు అలియాస్ భావు, సుందర్ మాలిక్‌పై కాల్పులకు బాధ్యత వహించాడు. భారతదేశం బయట ఉంటున్నట్లు భావిస్తున్న హిమాన్షుపై ఇంటర్‌పోల్ గతేడాది రెడ్ నోటీసు జారీ చేసింది. సోనిపట్‌లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ రాజ్‌పురోహిత్ మాట్లాడుతూ.. సుందర్ మాలిక్‌ను కాల్చడానికి ముందు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు హోండా సిటీ కారు నుండి దిగడం కనిపించిందని చెప్పారు. కాల్పులపై ఏడు పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. సుందర్ మాలిక్ నేర నేపథ్యాన్ని తెలుసుకునేందుకు పోలీసులు అతని కుటుంబాన్ని సంప్రదించారు.

సీసీటీవీ ఫుటేజీలో, ఇద్దరు వ్యక్తులు కారును పార్క్ చేసిన వెంటనే సుందర్ మాలిక్ ఎస్‌యూవీకి తుపాకీలను గురిపెట్టి దూసుకుపోతున్నట్లు కనిపించింది. మాలిక్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. వీలు పడలేదు. ఘటనా స్థలం నుంచి పారిపోయే ముందు ముష్కరులు మాలిక్‌పై పలుమార్లు కాల్పులు జరిపారు. సుందర్ మాలిక్‌పై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు.

Next Story