'బుల్డోజర్ చర్య అమానవీయం'.. యూపీ ప్రభుత్వాన్ని మందలించిన‌ 'సుప్రీం'

ప్రయాగ్‌రాజ్‌లోని ఇళ్లపై బుల్‌డోజర్‌ చర్యపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

By Medi Samrat
Published on : 1 April 2025 3:04 PM IST

బుల్డోజర్ చర్య అమానవీయం.. యూపీ ప్రభుత్వాన్ని మందలించిన‌ సుప్రీం

ప్రయాగ్‌రాజ్‌లోని ఇళ్లపై బుల్‌డోజర్‌ చర్యపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య 'అమానవీయం మరియు చట్టవిరుద్ధం' అని పేర్కొంటూ సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వం, ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీని మందలించింది. కూల్చివేత చర్యను "అమానవీయం"గా పేర్కొంటూ న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం.. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉందని, పౌరుల నివాస నిర్మాణాలను ఈ పద్ధతిలో కూల్చివేయలేమని అన్నారు. ఈ చర్య మన మనస్సాక్షిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆశ్రయం పొందే హక్కు ఉంది.. చట్టబద్ధమైన ప్రక్రియ కూడా ఉందని వ్యాఖ్యానించింది.

ఒక్కో ఇంటి యజమానికి ఆరు వారాల్లోగా రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అధికార యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సరైన చట్టపరమైన విధానాన్ని అనుసరించకుండా ప్రయాగ్‌రాజ్‌లో కూల్చివేత చర్యలను చేపట్టినందుకు కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మందలించింది. ఇది తప్పుడు సంకేతాలను పంపిందని పేర్కొంది.

మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిందని.. 2023లో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించిన గ్యాంగ్‌స్టర్-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్‌కు చెందిన భూమిగా భావించి ప్రభుత్వం దానిని కూల్చివేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇళ్లు కూల్చివేత‌ల‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని లుకర్‌గంజ్ వద్ద కొన్ని నిర్మాణాలకు సంబంధించి పిటిషనర్‌లకు మార్చి 6, 2021నే నోటీసు అందించినట్లు నివేదించబడింది.

Next Story