బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

SC issues notice to Centre on pleas challenging blocking of BBC documentary on PM Modi. గోద్రాలో 2002లో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి ఇటీవల బీబీసీ విడుదల చేసిన

By M.S.R  Published on  3 Feb 2023 9:21 AM GMT
బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

గోద్రాలో 2002లో చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి ఇటీవల బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీ ఎంత వివాదాస్పదం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన బీబీసీ డాక్యుమెంటరీ ప్రజలకు అబద్ధాలను చేరవేస్తోందని ఓ వర్గం ఆరోపిస్తూ ఉంది. భారత్ లో బీబీసీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ లింక్స్ అందకుండా కూడా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

ప్రజల ప్రవేశాన్ని నిరోధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బ్లాక్ చేయబడిన బీబీసీ డాక్యుమెంటరీని ప్రజలు యాక్సెస్ చేస్తున్నారని పేర్కొన్న అత్యున్నత న్యాయస్థానం, మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. వివాదాస్పద డాక్యుమెంటరీకి లింక్‌లను పంచుకునే ట్వీట్‌ల తొలగింపుపై ఆర్డర్‌కు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్‌ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పిటిషన్‌ను ఇవాళ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా, జర్నలిస్టు ఎన్‌ రామ్‌, సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, న్యాయవాది ఎమ్‌ఎల్‌ శర్మ వేసిన పిటిషన్‌లపై విచారణ సందర్భంగా జస్టిస్‌లు సంజీవ్‌ ఖన్నా, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

"ఇండియా: ది మోదీ క్వశ్చన్" అనే డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయమని గత నెలలో ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ట్విట్టర్, యూట్యూబ్‌లను ఆదేశించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆ డాక్యుమెంటరీని నిష్పాక్షికత లేని, వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబించే అంశమని పేర్కొంది.


Next Story