అస్సాం-మిజోరం సరిహద్దుల వివాదం.. పరిష్కారం ఇదే..!
Satellite Imaging to Demarcate Inter-State Borders. ఈశాన్య రాష్ట్రాల మధ్య ఇటీవల తలెత్తిన సరిహద్దు వివాదం సంచలమైన సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 2 Aug 2021 6:39 AM GMTఈశాన్య రాష్ట్రాల మధ్య ఇటీవల తలెత్తిన సరిహద్దు వివాదం సంచలమైన సంగతి తెలిసిందే..! హింసాత్మకంగా మారి.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిట్టుకునే వరకూ వివాదం కొనసాగింది. ఇటువంటి పరిణామాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ఆయా రాష్ట్రాల హద్దులను శాటిలైట్ ఇమేజింగ్ సాయంతో నిర్ణయించనుంది భారత ప్రభుత్వం. ఈ బాధ్యతను నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్(ఎన్ఈఎస్ఏసీ, నెశాక్)కి అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దులను శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా శాస్త్రీయంగా ఖరారు చేయాలన్న ఆలోచనను హోంమంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితం తెరపైకి తెచ్చారని ఆ అధికారులన్నారు. శాస్త్రీయంగా చేపట్టే సరిహద్దుల విభజన కచ్చితత్వంతో ఉంటుందనీ, దీని ఆధారంగా చూపే పరిష్కారం రాష్ట్రాలకు ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
1875లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఆధారంగా సరిహద్దుల్లోని రిజర్వు ఫారెస్టులో ఉన్న 509 చదరపు మైళ్ల ప్రాంతం తమదేనని మిజోరం వాదిస్తుండగా, 1993లో నిర్ణయించిన ప్రస్తుత సరిహద్దునే గుర్తిస్తామని అస్సాం చెబుతోంది. అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, జొరంతంగాలతో ఫోన్లో మాట్లాడారు. సమస్యకు అర్థవంతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు అనంతరం జొరంతంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయవద్దని ఆయన ప్రజలను కోరారు.
సరిహద్దు ఘర్షణలపై నోటీసులు అందితే మిజోరం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని అస్సాం సీఎం హిమంత చెప్పారు. అరెస్టయినా అవుతాను గానీ, తనతోపాటు కేసులు నమోదైన రాష్ట్ర అధికారులను మాత్రం విచారణకు పంపేది లేదన్నారు.