మహా రాష్ట్రలో సర్పంచ్ పదవి కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అలాగని సర్పంచ్ ఎన్నికల కోసం ప్రచారానికి ఇంత ఖర్చు పెట్టారని అనుకోకండి. సర్పంచ్ పదవిలో నువ్వు ఉండాలా.. లేక నేను ఉండాలా అని..! అందుకు ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఓ వ్యక్తి.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేవ్లాలీ తాలూకాలోని ఉమ్రానే అనే గ్రామంలో సర్పంచ్ పదవి కోసం బహిరంగంగా వేలంపాట వేశారు. గ్రామస్థులు అనధికారికంగా నిర్వహించిన ఈ వేలంలో రూ.2.05 కోట్లకు సర్పంచ్ పదవిని పాడుకుని విశ్వాస్ రావ్ దేవరా అనే వ్యక్తి ఆ పదవిని దక్కించుకున్నాడు. రూ.కోటీ పదకొండు లక్షలతో వేలంపాట మొదలైంది. అలా ప్రారంభమైన ఈ వేలం ఉత్కంఠభరితంగా కొనసాగి ఆఖరికి రూ.2.05 కోట్లకు చేరింది. ఈ వేలంపాటలో గెలిచిన రావ్ దేవరాను ఎన్నికల ప్రక్రియ లేకుండానే సర్పంచిగా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో వారి గ్రామంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తారని తెలిపారు.