దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేల మార్కును దాటింది. దేశంలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీని కలిసే మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయం సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ సాయంత్రం ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలవనున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బిజెపి కార్యకర్తలు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం విడుదల చేసిన అధికారిక తాజా డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదవడంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,121లకు చేరింది. దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య 74కు పెరిగింది. కేరళలో అత్యధికంగా 2,223 యాక్టివ్ కేసులు ఉండగా.. గుజరాత్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని.. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.