దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద ఒక్కో వ్యక్తికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పరిహారం పొందేందుకు అర్హులు అవుతారు. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ పథకం మే 5, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఏదైనా రహదారిపై మోటారు వాహనాన్ని ఉపయోగించడం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదానికి గురైన ఏ వ్యక్తి అయినా ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా నగదు రహిత చికిత్స పొందేందుకు అర్హులని ఈ నోటిఫికేషన్ తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని అమలు చేసే సంస్థగా జాతీయ ఆరోగ్య సంస్థ (NHA) వ్యవహరిస్తుంది. పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థలు మొదలైన వాటితో సమన్వయం చేసుకుంటుంది. "బాధితుడు ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా ఏడు రోజుల పాటు ఏ ఆసుపత్రిలోనైనా లక్షా యాభై వేల రూపాయల వరకు నగదు రహిత చికిత్స పొందేందుకు అర్హులు" అని వివరించారు. రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ఈ పథకాన్ని అమలు చేయడానికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.