వాటర్ బాటిల్ ధరపై కేసు వేస్తే ఏమైందో తెలుసా?
Restaurant Overcharged Me for Bottled Water, Here's How I Made Them Pay For It. పెద్ద రెస్టారెంట్లో, మల్టీప్లెక్స్ లో ఏ
By Medi Samrat Published on 20 Jan 2021 3:26 AM GMT
పెద్ద రెస్టారెంట్లో, మల్టీప్లెక్స్ లో ఏ వస్తువునైనా కొనాలని చూస్తే.. ఎమ్మార్పీ ధరకంటే చాలా ఎక్కువగా చెల్లించాలని మనకు తెలిసిన విషయమే.. అయితే ఎలాంటి రెస్టారెంట్లో అయినా ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ వసూలు చేయొద్దనే నిబంధన ఉన్నప్పటికీ ఆ యాజమాన్యలు మాత్రం ప్రజలను దోచుకోవడం మానడం లేదు. దీన్ని అధికారులు కూడా చూసీచూడనట్లు గానే వ్యవహరిస్తూ ఉంటారు. కొందరు ఈ వ్యవహారంపై హోటల్ నిర్వాకులను ప్రశ్నిస్తే కూడా.. దిక్కున్న చోట చెప్పుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుంటారు.
అందుకే చాలా మంది. హోటల్, మల్టీప్లెక్స్ కు వెళ్లినప్పుడు ఏం కొనకుండా ఉంటారు. లేకపోతే.. అక్కడ ఎంత చెబితే అంత ఇచ్చి కొంటారు. కానీ ప్రశ్నించడానికి ప్రయత్నం కూడా చేయరు. కానీ ఒక వ్యక్తి మాత్రం అలా సులభంగా ఈ విషయాన్ని వదిలేయలేదు. దీనిపై ఏకంగా న్యాయ పోరాటం చేశాడు. పోరాటం చేయడమేకాదు విజయం కూడా సాధించాడు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ లో జరిగింది.
రోహిత్ పాటిల్ అనే 67 ఏళ్ల వ్యక్తి.. 2015లో హైవే పక్కన ఉన్న ఒక హోటల్ కి వెళ్లి అక్కడ భోజనం చేశాడు. అలాగే ఒక వాటర్ బాటిల్ కొన్నాడు. అయితే దాని ధర రూ. 20ఉంటే ఏకంగా ఆ హోటల్ నిర్వాహకులు రూ. 164 వసూలు చేశారు. దీంతో కోపం తెచ్చుకున్న ఆ వ్యక్తి ఈ విషయాన్ని ఏకంగా కోర్టుకు తీసుకుపోయాడు.
కోర్టు మెట్లెక్కినప్పటికీ ఆ హోటల్ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. సర్వీసుకు తగ్గట్టుగానే వసూలు చేస్తున్నామని సమర్థించుకున్నారు. ఐదు ఏండ్ల పాటు ఈ కేసుకు సంబంధించి వాదన జరుగుతూ వస్తోంది. దీనిపై రెండు రోజుల క్రింద తుది తీర్పు వచ్చింది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు తేల్చింది. అంతే కాకుండా రోహిత్ పాటిల్ ను హోటల్ సిబ్బంది వేధింపులకు గురి చేసినందుకు రూ. 2500 చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. రూ. 3 వేలు బాధితుడికి పరిహారంగా కూడా ఇవ్వాలని సూచించింది.