Heavy Rains : స్కూళ్లు, కాలేజీలు బంద్‌.. మందగించిన న‌గ‌ర 'వేగం'

దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీని కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

By Medi Samrat
Published on : 19 Aug 2025 8:59 AM IST

Heavy Rains : స్కూళ్లు, కాలేజీలు బంద్‌.. మందగించిన న‌గ‌ర వేగం

దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీని కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాల కార‌ణంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు మూత‌బడ్డాయి. అంతే కాదు భవిష్యత్తులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ముంబైలో భారీ వర్షం కురిసింది. దీని కారణంగా రోడ్లు చెరువుల‌ను త‌లించాయి. దీంతో నగరం వేగం మందగించింది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు BMC ప‌నితీరును మరోసారి బహిర్గతం చేశాయి. గత 8 గంటల్లో నగరంలో 177 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులుగా మారి ఇళ్లకే పరిమితమయ్యారు. అధిక వర్షం ప్రభావం విమాన సర్వీసులు, ట్రాఫిక్‌పై కూడా కనిపించింది. తక్కువ దృశ్యమానత కారణంగా, చాలా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.. లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమానాశ్రయానికి వెళ్లే రహదారులు జలమయమయ్యాయని, ట్రాఫిక్ మందగించిందని ఇండిగో ఒక స‌ల‌హా జారీ చేసింది.

మరోవైపు రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. చాలా ముఖ్యమైన పని ఉంటే మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్లాలని ప్ర‌భుత్వ యంత్రాంగం చెబుతోంది. ఆగస్టు 21 వరకు ముంబైలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయగా.. ఇప్పటి వరకు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మరణించారు. చాలా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.

Next Story