రజనీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..
Rajinikanth Health Bulletin. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఉదయం అపోలో ఆసుపత్రి యాజమాన్యం
By Medi Samrat Published on 26 Dec 2020 5:48 AM GMT
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఉదయం అపోలో ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈరోజు కొన్ని వైద్య పరీక్షలు ఆయనకు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. రజనీకాంత్ హై బీపీతో బాధపడుతూ నిన్న అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు హైబీపీ ఉందని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారని.. తదుపరి డిచ్చార్జ్ పై నిర్ణయం ఉంటుందని బులిటెన్లో పేర్కొంది.
ఇదిలావుంటే.. రజనీకాంత్ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్న ఆయన కుమార్తె ఐశ్యర్య హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. అయితే సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నందున కుమార్తె ఐశ్వర్యను కూడా రూమ్లో ఉండొద్దని రజనీకాంత్ చెప్పినట్లు సమాచారం.
మరోవైపు తెలంగాణ గవర్నర్ తమిళి సై, టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మోహన్బాబు.. రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులకు ఫోన్ చేసి హెల్త్ కండీషన్ తెలుసుకున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదిలావుంటే.. 'అన్నాత్తే' సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘాటింగ్ జరుగుతుండగా.. చిత్ర యూనిట్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో చిత్ర షూటింగ్ ను వాయిదా వేశారు. వెంటనే రజినీకాంత్ కూడా క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. సంక్రాంతి కల్లా 'అన్నాత్తే' సినిమా షూటింగ్ను పూర్తి చేసి.. రాజకీయాల్లో బిజీ కావాలనుకున్న రజనీకాంత్ అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.