ఢిల్లీ హైకోర్టు ముందు ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్
Rajasthan cop shoots himself dead at Delhi high court. దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు వద్ద ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 29 Sep 2021 12:00 PM GMT
దేశ రాజధాని ఢిల్లీ హైకోర్టు వద్ద ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం 10:15 గంటలకు గేట్ నంబర్ -3 వద్ద కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ని రాజస్థాన్ బెటాలియన్కు చెందిన టింకూరామ్గా పోలీసులు గుర్తించారు. సెలవుల తర్వాత కానిస్టేబుల్ టింకూరామ్ ఈ రోజే విధుల్లో చేరాడు. వ్యక్తిగత కారణాలతోనే టింకూరామ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఢిల్లీ హైకోర్టులో నియమించబడిన 30 ఏళ్ల రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ బుధవారం ఉదయం కోర్టు ప్రాంగణంలోనే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ సంఘటన తరువాత, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టు ప్రాంగణాన్ని సందర్శించారు. పోలీసు డిప్యూటీ కమిషనర్ (న్యూఢిల్లీ) దీపక్ యాదవ్ మాట్లాడుతూ ఉదయం 9.30 గంటల సమయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. ఈ రోజు ఉదయం అతను 9.30 గంటల ప్రాంతంలో డ్యూటీకి వచ్చాడని.. సెలవు నుండి తిరిగి వచ్చిన తరువాత అతను ఈ రోజు విధుల్లో చేరాడని యాదవ్ అన్నారు. కొద్ది రోజుల క్రితం రోహిణి కోర్టులో గ్యాంగ్స్టర్ ప్రత్యర్థి గ్యాంగ్ చేతిలో కాల్చి చంపబడిన నేపథ్యంలో ఢిల్లీలోని కోర్టులు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధానిలోని అన్ని కోర్టులలో పోలీసులు భద్రతను పెంచారు.