ప్రయాణీకుల భద్రతను మెరుగుపరిచే నిర్ణయంలో భాగంగా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 74,000 కోచ్లలో తలుపుల దగ్గర ఉన్న కామన్ మూవ్మెంట్ ఏరియాలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. అన్ని కోచ్లలో సీసీటీవీ కెమెరాలు ప్రయాణీకుల భద్రతను గణనీయంగా మెరుగుపరుస్తాయి. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడే ముఠాలను అడ్డుకోడానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని ఒక అధికారి తెలిపారు.
నార్తర్న్ రైల్వేలోని లోకో ఇంజిన్లు, కోచ్లలో విజయవంతమైన సీసీటీవీ కెమెరా ట్రయల్స్ తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది రైల్వే విభాగం. రైల్వే శాఖ సహాయ మంత్రి వైష్ణవ్, రైల్వే బోర్డు అధికారులు శనివారం జరిగిన సమావేశంలో సీసీటీవీ కెమెరాల ట్రయల్స్ పురోగతిని, లోకోమోటివ్లు, కోచ్లలో ఇన్స్టాలేషన్ను సమీక్షించారు. గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లలో కూడా మరియు తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లో కూడా అధిక-నాణ్యత గల విజువల్స్ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే అధికారులను కోరారు. ప్రతి రైలు కోచ్కు డోమ్ తరహా నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ప్రవేశ మార్గంలో రెండు కెమెరాలు ఉంటాయి. అదేవిధంగా, ప్రతి లోకోమోటివ్లో ఆరు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఒకటి ముందు వైపు, ఒకటి వెనుక వైపు మరియు రెండు వైపులా ఉంటాయి.